రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు, డివైడర్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. మరోవైపు రూ.130 కోట్ల వ్యయంతో వెంకటాపూర్ – రగుడు దాకా ఫోర్లేన్, కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ – రగుడు దాకా సిక్స్లేన్ పనులు ఊపందుకున్నాయి. మరో వైపు మానేరు ఒడ్డును వరంగల్ భద్రకాళి తరహా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల ప్రగతిలో దూసుకెళ్తున్నది. తీరొక్క పనులతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తన రూపురేఖలు మార్చుకున్నది. అద్దాల్లా రోడ్లు, జంక్షన్ల సుందరీకరణతో సరికొత్తగా కనిపిస్తున్నది. ఒకవైపు నాలుగు వరుసలు, మరోవైపు ఆరు వరుసల రహదారులపై వాహనాలు రయ్య్మ్రంటూ దూసుకుపోనున్నాయి. తాజాగా ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.130కోట్లతో రెండు బైపాస్ రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్ధేశించిన సమయానికి ముందే అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
అమాత్యుడి ప్రత్యేక దృష్టి
జిల్లా కేంద్రం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. జిల్లా ఏర్పాటుకు ముందే రూ.100 కోట్లతో పట్టణంలోని కేకే, ఎస్ఎస్రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆరు వరుసలతో కేకే రోడ్డు, నాలుగు వరుసలతో ఎస్ఎస్ రోడ్డును నిర్మించారు. అందులో భాగంగా నేతన్న చౌరస్తా నుంచి వెంకంపేట ప్రభుత్వ పాఠశాల దాకా రూ.2.18 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. పాతబస్టాండ్ నుంచి పెద్దబజార్ మీదుగా రెండు బైపాస్రోడ్లను కలిసే విధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా, విస్తరణ చేపట్టిన రహదారుల మధ్యలో డివైడర్ల నిర్మాణం చేపట్టి, మొక్కలు నాటారు. చెట్లు ఏపుగా పెరిగి పట్టణానికి పచ్చలహారం తొడిగి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఇక అంబేద్కర్, నేతన్న, కొండా లక్ష్మణ్బాపూజీ సుందరీకరించిన జంక్షన్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా పోలీసు శాఖ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. నేతన్న చౌరస్తాలో సిగ్నల్స్ను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వీటిని త్వరలో ప్రారంభించనున్నారు. కాగా అంబేద్కర్, గాంధీ చౌరస్తాలలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
నాడు షికారుకు వెళ్లేంత సీను లేని సిరిసిల్ల నేడు పర్యాటక కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే కొత్తచెరువును ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దగా, తాజాగా మానేరు ఒడ్డును వరంగల్ భద్రకాళి చెరువు తరహాలో మరో ట్యాంక్ బండ్ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రూ.30కోట్లను మంజూరు చేశారు. మానేరు బ్రిడ్జికి ఎడమ వైపున మూడు కిలోమీటర్ల మేర రామప్ప గుట్ట సమీపం దాకా కరకట్టను నిర్మించారు. కుడివైపున రూ.30కోట్లతో సాయిబాబా గుడి దాకా 60 ఫీట్ల వెడల్పుతో మరో కరకట్టను నిర్మించనున్నారు. కరకట్ట పొడవునా నాలుగు పిక్నిక్ స్పాట్లు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా బ్రిడ్జి, బతుకమ్మ ఘాట్, నెహ్రూనగర్లోని అంబ భవాణి ఆలయం, సాయిబాబా ఆలయాల వద్ద స్థలాలను పరిశీలించారు. దీనిపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. పార్కులు, పౌంటెన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మ ఘాట్ వద్ద పెద్ద పార్కు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కట్టపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, యోగా చేసుకునేందుకు వీలుగా ప్లాట్ఫాంలు నిర్మించనున్నారు. మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు ఎదురెక్కి చిన్నపాటి సముద్రాన్ని తలపిస్తున్నది. మానేరు బ్రిడ్జి నుంచి కుడి, ఎడమ వైపులా కరకట్టలపై విశాఖ బీచ్ను తలపించేలా పార్కులను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే మానేరుపై రోడ్డు కం రైలు వంతెన కూడా నిర్మించనున్నందున జిల్లా కేంద్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని వీకెండ్ స్పాట్గా తీర్చిదిద్దే పనులకు మున్సిపల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి.
రూ.50 లక్షలతో బాపూజీ జంక్షన్
విస్తరిస్తున్న జిల్లా కేంద్రంలో జంక్షన్ల సుందరీకరణ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే గాంధీ, అంబేద్కర్, నేతన్న జంక్షన్లు సరికొత్తగా మార్చారు. మానేరు బ్రిడ్జి వద్ద రూ.50 లక్షలతో కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ను సుందరీకరీంచారు. అక్కడ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రగుడు కలెక్టరేట్ వద్ద రెండు బైపాస్లు కలిసే చౌరస్తా, చంద్రంపేట, నర్సింగ్ కళాశాల చౌరస్తాలలో నూతన జంక్షన్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. వాటికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. త్వరలో డీపీఆర్ రూపొందించి పనులు పారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శరవేగంగా బైపాస్రోడ్లు
జిల్లా కేంద్రానికి రెండు బైపాస్రోడ్లు మంజూరయ్యా యి. రూ.95 కోట్లతో వెంకటాపూర్ నుంచి రగుడు దాకా 11కిలోమీటర్ల పొడవున వంద ఫీట్లతో నాలు గు వరసల రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ నుంచి రగుడు జంక్షన్ దాకా గతంలో నిర్మించిన డబుల్రోడ్డు బైపాస్ను ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. ఈ రోడ్డు కోసం రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరం, వంద ఫీట్ల వెడల్పుతో తలపెట్టగా, ప్రస్తుతం మెటల్ పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మేలో పనులు ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాల్సి ఉండగా, జనవరి నెలాఖరులోగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనుల్లో వేగం పెంచారు. రెండు బైపాస్ రోడ్ల పనులు చకాచకా సాగుతున్నాయి.