కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎల్ఎండీకి నీళ్లు వస్తుండడం, మరోవైపు వర్షాలు పడుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎండకాలం ప్రారంభంలో తాగు నీటి అవసరాలకు కేవలం 7.3 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఎత్తిపోతల ద్వారా ఎస్సారార్ జలాశయానికి వచ్చిన నీటిని ప్రతి రోజూ 9 వేల క్యూసెక్కులకుపైగా విడుదల చేస్తున్నారు. మరో వైపు మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా మోయతుమ్మెద నుంచి కూడా వరద వస్తుండడంతో జలాశయంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది. దీంతో ప్రస్తుతం ఎల్ఎండీలో 10 టీఎంసీలకుపైగా నీరున్నది. ఈ నెల 25 నుంచి దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో జరిగే స్టేట్ ఇరిగేషన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ స్టాండింగ్ కమిటీ (శివం) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
– కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం జలాల రాకతో ఎల్ఎండీలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ నెల 18న మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ గేట్లు ఎత్తి దిగువన ఉన్న ఎల్ఎండీ జలాశయానికి విడుదల చేశారు. దీంతో ప్రతి రోజూ 9 వేల క్యూసెక్కులకు పైగా విడుదల చేస్తున్నారు. అంతకుముందు ఎల్ఎండీలో 7.3 టీఎంసీలు మాత్రమే ఉండగా, రెండు రోజుల్లోనే అదనంగా 3.1 టీఎంసీల నీటిని తరలించారు. మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా పడుతున్న నేపథ్యంలో ఎల్ఎండీకి ఎగువన ఉన్న మోయతుమ్మెద వాగు నుంచి కూడా వరద వచ్చి చేరుతోంది. గురువారం 3,500 క్యూసెక్కుల వరద ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టినా ఎల్ఎండీకి మిడ్ మానేరు ద్వారా నీటి తరలింపు కొనసాగే అవకాశం ఉన్నది. 24 టీఎంసీల నీటి సామర్థ్యంగల ఎల్ఎండీ జలాశయంలోకి వరద ఇదే విధంగా కొనసాగితే మరో నాలుగైదు రోజుల్లో ఇంకో 5 టీఎంసీలకు చేరవచ్చు.
ఈ నెల 25 నుంచి నీటి విడుదల!
ఎల్ఎండీ దిగువ ఆయటకట్టుకు ఈనెల 25 నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగే శివం (రాష్ట్ర సాగునీటి సమీకృత నిర్వహణ ప్రణాళిక స్టాండింగ్ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసినట్లయితే కరీంనగర్ జిల్లాలోని 11 మండలాల్లో 1,31,352 ఎకరాలకు సాగు నీరు అందే అవకాశముంటుంది. దిగువ ప్రాంతంలోని 7 జిల్లాలు, 33 మండలాల్లోని 9 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా, మరో 88 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. ఆన్ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఆయకట్టును రెండు జోన్లుగా విడదీశారు. కాకతీయ దిగువ కాలువ పరిధిలోని 146 కిలోమీటరు నుంచి 284 కిలోమీటరు వరకు జోన్-1గా విభజించారు. దీని పరిధిలో కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల పరిధిలోని ఆయకట్టు ఉంటుంది. దీనికి ఏడు రోజుల పాటు నీటిని విడుదల చేస్తారు. అలాగే, కాకతీయ కాలువ 284 కిలోమీటరు నుంచి 346 కిలోమీటరు వరకు జోన్-2గా విభజించారు. దీని పరిధిలో మహబూబాబాద్, ఖమ్మం, సూర్యపేట జిల్లాల ఆయకట్టు ఉంటుంది. జోన్-1కు 7 రోజులు, జోన్-2కు 8 రోజుల పాటు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.
ఆయకట్టు రైతుల్లో ‘కాళేశ్వరం’ భరోసా
వానకాలం సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేక పోవడంతో రైతులు కాస్త దిగులుపడ్డారు. కాళేశ్వరం ఎత్తి పోతల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయకట్టు సాగుకు నీళ్లందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ఆ మేరకు నీటిని శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) జలాశయానికి, అక్కడికి నుంచి ఎల్ఎండీకి తరలిస్తుండటంతో ఆయకట్టు రైతుల్లో భరోసా కలిగింది. అంతే కాకుండా, ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలోని కాకతీయ కాలువ 122.450 కిలోమీటరు నుంచి 144.175 కిలోమీటరు వరకు, 146.000 కిలో మీటరు నుంచి 202.178వ కిలో మీటరు వరకు డీ-87, డీ-94, డీబీఎం 1 నుంచి 20 వరకు ఉన్న కాలువల ద్వారా 1,31,352 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.
వర్షాలు తగ్గితే నీటి విడుదల
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆశించినంతగా నీరు వస్తున్నది. ఇప్పటికే జలాశయంలో 10.329 టీఎంసీల నీరున్నది. ఈ సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 3 టీఎంసీలకు పైగా నీటిని తరలించాం. దిగువ ఆయకట్టుకు ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేయాలనేది ప్రణాళిక. శుక్రవారం హైదరాబాద్లో శివం సమావేశం ఉంది. ఇందులో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తగ్గు ముఖం పట్టిన తర్వాత నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది.
– శంకర్, ఈఎన్సీ, ఎస్సారెస్పీ ప్రాజెక్టు