శంకరపట్నం, మార్చి 6 : రైస్మిల్లర్లు నష్టాల్లో ఉన్నారని తెలిసి కడాఊ వేధించవద్దని ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వేడుకున్నారు. ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీని విధించి వేధించడం సరికాదని సూచించారు. శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన బాలాజీ రైస్మిల్లు యజమాని తణుకు సురేశ్ భార్య స్వప్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని జిల్లాలోని రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తీవ్ర దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డితో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ నాయకులు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా పాడి గణపతిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైస్ మిల్లర్లకు ఎంతో నష్టం కలుగుతున్నదని ఆవేదన చెందారు.
రైస్మిల్లర్లను దొంగల్లా చూడవద్దవద్దని, ప్రస్తుతం మిల్లర్ల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. కొన్ని సంఘాల నాయకుల వల్ల కూడా రైస్ మిల్లుల వ్యవస్థ భ్రష్టుపట్టి పోతున్నదని ఆరోపించారు. అలాంటి సంఘాల నాయకులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, సివిల్ సైప్లెస్ శాఖ మంత్రి, కమిషనర్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామని, రాష్ట్ర రైస్ మిల్లు ఇండస్ట్రీలోనే మొదటిసారి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. తణుకు సురేశ్కు దిగుమతి అయిన ధాన్యం తడిసి భారీగా నష్టాలు రావడం వల్లనే డిఫాల్ట్ అయ్యాడని తెలిపారు. దీంతో సివిల్ సైప్లె అధికారులు ఎక్కడ కేసులు పెడతారో అనే భయంతోనే ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారి నష్టాల్లో ఉన్నాడని తెలిసీ అధికారులు వేధించడం సరికాదన్నారు. వెంటనే జరిమానా, వడ్డీని తొలగించి మిల్లర్ల కుటుంబాలను ఆత్మహత్యల నుంచి కాపాడాలని కోరారు. రైస్ మిల్లర్లు ఎవరూ అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, అసోసియేషన్ నాయకులం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.