కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) ; గత వానకాలం సీజన్లో వరిపై తెగుళ్ల ప్రభావం పడింది. నార్లు పోసింది మొదలు.. కోతకు వచ్చే దాకా రకరకాల రోగాలతో అనేక చోట్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. సకాలంలో వర్షాలు రాక ఆలస్యంగా నాట్లు వేయడంతో వచ్చిన తెగుళ్లను తట్టుకునే పరిస్థితి కనిపించలేదు. కొత్తపల్లి, రామడుగు, గంగాధర మండలాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా ఆలస్యంగా నాట్లు వేసిన ప్రతి చోటా రైతులకు ఇలాంటి దుస్థితే ఎదురైంది. ఎకరాకు సగటున 23 నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావల్సి ఉండగా.. 18 నుంచి 20 క్వింటాళ్లే వచ్చాయి. మరీ ఆలస్యంగా వరి నాట్లు వేసిన రైతులకు చేదు అనుభవమే మిగిలింది. పొట్ట దశలో కాండం తొలుచు, మొగి పురుగు వంటి తెగుళ్లు ఆశించి గొలక తాలుగా మారిపోయింది.
గత వానకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు అనుకూలించలేదు. జూన్లో పూర్తిగా వర్షాలే పడలేదు. దీంతో రైతులు ఆలస్యంగా వరి నార్లు పోయాల్సి వచ్చింది. నాట్లు ఆలస్యంగా పడ్డాయి. పొలాలు పొట్ట దశకు చేరుకునే సరికి పంటను కాండం తొలుచు, మొగి పురుగు వంటి తెగుళ్లు ఆశించాయి. ఈ దశలో ఎన్ని సార్లు పురుగు మందులు వాడినా ఫలితం లేకపోయింది. వర్షాలతో సంబంధం లేకుండా నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కాస్త ముందుగా నాట్లు వేసినా.. పిలక దశలో కూడా రోగాలు ఆశించాయి. తెగుళ్లను నియంత్రించేందుకు రైతులు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. పొట్ట దశకు చేరుకునే సమయంలో వచ్చిన తెగుళ్లను అరికట్టడం సాధ్యం కాలేదు. కొత్తపల్లి, గంగాధర, రామడుగు వంటి మండలాల్లో కొందరు రైతులు తమ పొలాల్లో పశువులను మేపుకున్నారు. కొందరు కోత చార్జీలు మీద పడతాయని పొలాలను వదిలేశారు. మెజార్టీ చోట్ల ఆలస్యంగా నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఎక్కడా కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
దిగుబడిపై ప్రభావం
వానకాలం వరి సాగుపై తెగుళ్ల ప్రభాం కారణంగా సగటు దిగుబడి తగ్గింది. జిల్లా ప్రణాళికా అధికారులు ప్రతి సీజన్లో నిర్వహించే పంట కోత ప్రయోగాల ఫలితాల ప్రకారం చూస్తే.. సగటున 23 నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చు. వాతావరణం అనుకూలించి, పంటలు సరిగ్గా పండితే ఈ సగటు దిగుబడి శాతం మరింత పెరుగుతుంది. అయితే, పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేసిన క్షేత్రంలో పావు గుంటలో దిగుబడిని అధికారులు సేకరిస్తారు. దీనిని తూకం వేసినపుడు 13 నుంచి 14 కిలోలు వచ్చినప్పుడే సగటు దిగుబడి వచ్చినట్లుగా పరిగణిస్తారు. కానీ, ఈ సారి అంతకంటే తక్కువగా 10 నుంచి 12 కిలోలు వచ్చినట్లు తెలుస్తున్నది. దీన్నిబట్టి సాధారణ దిగుబడి కూడా తగ్గినట్లు స్పష్టమవుతుండగా.. ఆలస్యంగా వరి సాగు చేసిన మరి కొందరు రైతుల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తున్నది. ఇలాంటి రైతుల పొలాల్లో 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి కూడా రానట్లు తెలుస్తున్నది. ఇంకొందరు రైతులైతే పొట్ట దశలో ఆశించిన తెగుళ్లను అరికట్టే పరిస్థితి లేక పశువులను మేపుకున్నారు. కోత ఖర్చులు మీద పడతాయని భావించి మరికొందరు రైతులు పొలంలోనే వదిలేశారు. ఆలస్యంగా నాట్లు వేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అయితే, అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. తెగుళ్లు ఆశించింది నిజమే అయినా దిగుబడిపై అంతగా ప్రభావం చూపలేదని అంటున్నారు.