చొప్పదండి, నవంబర్ 13 : ‘రానున్న ఎన్నికల్లో తప్పిపోయి చెయ్యి గుర్తుకు ఓటేస్తే మళ్లీ టార్చ్ లైట్ కొనుక్కునే దుస్థితి వస్తుంది. 10 హెచ్పీ మోటర్తో మూడు గంటల్లో మూడెకరాలు పారించవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నడు. అసలు తెలంగాణలో ఎక్కడైనా రైతులు అంత పెద్ద మోటర్లు వాడుతున్నరా..? 3, 5 హెచ్పీ మోటర్లకు మించి వాడడం లేదు. 10 హెచ్పీ కొనాలంటే రైతులకు ఆర్థిక భారం అవుతుంది. ఈ మాత్రం కరెంటుపై కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నడు. అలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. సోమవారం రామడుగు మండలంలోని షానగర్ లక్ష్మీ గార్డెన్స్లో చొప్పదండి, రామడుగు, గంగాధర మండలం కురిక్యాలలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో గంగాధర, బోయినపల్లి మండలాల బూత్ కమిటీల సమావేశాలకు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్తో కలిసి హాజరై మాట్లాడారు.
రానున్న ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేస్తే మోసపోతామని, మళ్లీ టార్చ్ లైట్ కొనుక్కునే దుస్థితి వచ్చి గోసపడతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు. సోమవారం రామడుగు మండలంలోని షానగర్ లక్ష్మీ గార్డెన్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఏర్పాటు చేసిన చొప్పదండి, రామడుగు మండలాలకు చెందిన బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయని, తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ రావాలని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా విధంగా బూత్ కమిటీ సభ్యులు, 100 ఓటర్ల ఇన్చార్జిలు ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గతంలో 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే దానిని 26 వేల మెగావాట్ల ఉత్పత్తికి పెంచామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరినదిపై ఒకే ఒక ఎస్సారెస్పీ ప్రాజెక్టు మాత్రమే ఉందని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎల్లంపల్లి, సుందిళ్ల, మేడిగడ్డ అన్నారం, తుపాకులగూడెం, తుమ్మగూడం ఇలా ఆరు ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందాయని చెప్పారు.
‘కేసీఆర్ బీమా ఇంటికి ధీమా, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, ఆసరా పెన్షన్లు, ఆరోగ్యలక్ష్మి పెంపుపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. 100 ఓటర్ల ఇన్చార్జిలు, కార్యకర్తలు వారియర్స్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలని మాట్లాడుతున్నడు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవచ్చని అంటున్నడు. మామూలుగా రైతులందరూ 3, 5 హెచ్పీ మాత్రమే వాడుతరు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇవే వాడుతున్నరు. 10 హెచ్పీ కొనుగోలు చేయాలంటే రైతులకు అధిక ఖర్చుతో కూడుకున్న పని. ఈ మాత్రం అవగాహన రేవంత్రెడ్డికి లేదు’ అని ఎద్దేవా చేశారు. మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోరని చెప్పారు. గతంలో కర్ఫ్యూ, దోపిడీ, దొంగతనాలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి యువకులకు అవేంటో తెలియకుండా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీలు చిలుక రవీందర్, కలిగేటి కవిత- లక్ష్మణ్, జడ్పీటీసీలు మాచర్ల సౌజన్య-వినయ్, మారొండ లక్ష్మి -కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ-భూమారెడ్డి, మారెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుకారెడ్డి, మామిడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న
బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న. రూ.1800 కోట్లతో పనులు చేసి చూపిస్తున్న. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ఇంటింటికీ వెళ్లి 100 ఓట్ల ఇన్చార్జ్లు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి. కార్యకర్తలు లేకపోతే నేను లేను. కార్యకర్తలే నా బలం నా బలగం. ఈ నెల 17న గంగాధరలో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది. నియోజకవర్గంలోని ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలి.
– బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్