గంగాధర, జూలై 16: ‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రాకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండబెడుతూ కన్నీళ్లు పెట్టిస్తున్నాడని’ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. పొలాలకు నీళ్లు ఇవ్వమని అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లాలని ఇటీవల రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం గంగాధర మండలం మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ తెలంగాణ రైతుల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎంత రక్తమైనా ఇస్తారని చెప్పారు. ‘ఇదిగో మా రక్తం ఇస్తున్నాం.. రైతులకు నీళ్లు ఇవ్వు’ అంటూ బ్లడ్ ప్యాకెట్లను చూపుతూ సవాల్ విసిరారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి ఇక్కడి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేవలం కేసీఆర్ను బద్నాం చేయడానికే రేవంత్రెడ్డి నీటిని ఎత్తిపోయడంలేదని దుయ్యబట్టారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన టైంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక్కడ గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేచినేని నవీన్రావు, గంట్ల జితేందర్రెడ్డి, జనగం శ్రీనివాస్, నాయకులు కంకణాల విజేందర్రెడ్డి, ద్యావ మధుసూదన్రెడ్డి, వేముల దామోదర్, యండి నజీర్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం, దూలం శంకర్గౌడ్, గడ్డం స్వామి పాల్గొన్నారు.