Korukanti Chander | అంతర్గాం, మే 16 : పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ‘దోచుకో.. దాచుకో..’ అనే నినాదం తప్ప, రైతులను ఆదు కునే ధ్యాసే లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన జాప్యం ఇప్పుడు, రైతుల పాలిటశాపంగా మారిందని మండి పడ్డారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుల అంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని, సకాలంలో ఎరువుల పంపిణీ, రైతుబంధు, ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు గుర్తుచేశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉండటంతో ఇటీవల అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసి రైతులకు ఇబ్బందులు అయ్యాయని అన్నారు. ధాన్యం బస్తాల్లో కోతలు విధించడంతో రైతుకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జామ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.