‘అయ్యో అన్న య్య. బావిలో పడింది నువ్వని తెల్వకపాయె. ఉదయం నుంచి కారు తీసేందుకు శ్రమించినా ఫలితం లేకపాయె. తీరా చూసే సరికి నువ్వు కనిపిస్తివి. ఎంత పనాయె అన్నయ్యా’ అంటూ మానకొండూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బూదయ్య నాయక్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన సోదరుడు రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతదేహంపై పడి బోరుమన్నాడు.
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లోని పుల్నాయక్ తండాకు చెందిన పాపయ్య నాయక్ (60) గురువారం కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు కారులో వెళ్తున్నాడు. చిన్నముల్కనూర్ శివారుకు చేరుకోగానే అదుపుతప్పి బావి గొడను ఢీకొట్టి పక్కనే ఉన్న బావిలో కారు పడిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిగురుమామిడి ఎస్ఐ మధుకర్రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి రూరల్ ఏసీపీ విజయసారథి, తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. అందులో పాపయ్య నాయక్ సోదరుడు మానకొండూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బూదయ్య నాయక్ ఉన్నారు. కానీ, అప్పటి వరకు బావిలో పడ్డది తన అన్నయ్య అని ఆయనకు తెలియదు.
పోలీస్, ఫైర్ సిబ్బంది అంతా కలిసి బావిలో పడ్డ కారును క్రేన్ సహాయంతో తీసేందుకు రాత్రి దాకా శ్రమించారు. రాత్రి 8.30గంటల ప్రాంతంలో కారును బయటికి తీయగా, అక్కడే ఉన్న బూదయ్య నాయక్ కారు నెంబర్ చూసి అనుమానించాడు. కారును బయటికి తీసిన తర్వాత డోర్లు తెరిచి చూడగా అందులో ఉన్న తన సోదరుడు పాపయ్య నాయక్ను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మృతదేహంపై పడి బోరుమన్నాడు. బావిలో పడింది తన అన్న అని ఏమాత్రం ఊహించలేదని, ఘోరం జరిగిపోయిందని కన్నీరుమున్నీరుగా రోదించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. పాపయ్యకు భార్య భారతి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.