మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవ వేతనం మూడింతలైంది. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1000కి అదనంగా రూ.2 వేలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి వేతనం ఇప్పుడు రూ.3 వేలకు పెరిగింది. గతంలో 60:40 చొప్పున కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 చొప్పున రూ.వెయ్యి చెల్లించగా, ఇవి తమకు చాలడం లేదని ఇటీవల మధ్యాహ్న భోజన నిర్వాహకులు 20 రోజుల పాటు నిరవధిక ఆందోళన చేపట్టారు. దీంతో వారి బాధను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రూ.2,400 చేసింది. అంటే వీళ్లకు ఇచ్చే గౌరవ వేతనంలో 80 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా తన వాటా పెంచాలని మధ్యాహ్న భోజన నిర్వాహకుల్లో డిమాండ్ వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం ద్వారా వారి ఆకలి తీర్చవచ్చని, హాజరు శాతాన్ని పెంచవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం కింద ఖర్చులను 60 శాతం కేంద్ర, 40 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా ఉన్న కుక్లు, హెల్పర్లకు కేంద్ర వాటా కింద రూ.600, రాష్ట్రం వాటా కింద రూ.400 చెల్లిస్తూ వచ్చాయి. ఏండ్ల తరబడి ఇదే గౌరవ వేతనంపై పని చేస్తున్నామని, అవి తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని ఇటీవల మధ్యాహ్న భోజన నిర్వాహకులు 20 రోజుల పాటు నిరవధిక ఆందోళన చేశారు. వీరి బాధను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.2 వేలు పెంచుతూ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. వీరికిప్పుడు కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.600 అయితే రాష్ట్రం ఇస్తున్నది రూ.2,400. అంటే 80 శాతం గౌరవ వేతనం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
విద్యార్థుల ఆకలి తీర్చుతున్న నిర్వాహకులు అర్ధాకలితో అలమటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2022 మార్చి 15న బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం తన వాటా పెంచాలనే నిర్ణయం తీసుకోకపోవడం, గౌరవ వేతనం పెంచాలని నిర్వాహకులు ఆందోళన చేపట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనాలు పెంచుతూ ఈ నెల 3న ఉత్తర్వుల సంఖ్య 8ని జారీ చేసింది. దీంతో కరీంనగర్ జిల్లాలోని 1,143 మందికి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసినా..
మధ్యాహ్న భోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆది నుంచి సంస్కరిస్తూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దొడ్డు బియ్యం అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్న తీరును చూసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 2015 జనవరి 1 నుంచి అన్ని ప్ర భుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాల్లో సన్న బియ్యంతో భోజనాలు వడ్డిస్తోంది. అంతే కాకుం డా మధ్యాహ్న భోజనం వండేందుకు అన్ని పాఠశాలల్లో కిచెన్ షెడ్లు నిర్మించింది. మధ్యాహ్న భో జన నిర్వాహకుల బాధలను కూడా ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వమే పట్టించుకుంటోంది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా విద్యార్థులకు పెట్టే భో జనంలో వడ్డించే కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనెల ధరలు పెరుగుతున్నా ఏండ్ల తరబడి ఒకే ధర చెల్లిస్తూ వచ్చింది.
గత జనవరి 6న రాష్ట్ర ప్రభుత్వమే వీటి ధరలను మరోసారి పెంచింది. అప్పటి వరకు 1నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థి భోజన ఖర్చులు కేవలం రూ.4.97 మాత్రమే ఉండగా ఇప్పుడు రూ.5.45 పెంచారు. 6, 7వ తరగతికి రూ.7.45 నుంచి రూ.8.17కు, 9, 10 తరగతులకు రూ.9.95 నుంచి రూ. 10.67కు పెంచారు. అంతేకాకుండా వారంలో మూడు సార్లు ఇస్తున్న గుడ్డు ధర రూ.4 నుంచి రూ.5కు పెంచారు. అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తోంది. తాజాగా, మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తన వాటాగా అదనపు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ్గా పేరు మార్చడం మినహా ఈ పథకాన్ని గానీ, పథక నిర్వహణకు శ్రమిస్తున్న కుక్, హెల్పర్లకు గానీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గౌరవ వేతనాల్లో 80 శాతం రాష్ర్టానిదే..
కరీంనగర్ జిల్లాలో 1,143 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. వీరికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద నెలకు ఒక్కొక్కరికి రూ.400 చొప్పున నెలకు రూ.4,57,200 చెల్లిస్తోంది. వీరికి రూ.2 వేల చొప్పున పెంచితే నెలకు రూ.22.86 లక్షలు భరించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నెలకు రూ.27,43,200 చెల్లిస్తుంటే కేంద్ర మాత్రం నెలకు 6,85,800, మాత్రమే చెల్లిస్తోంది. అదే ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే మొత్తం రూ.3 కోట్ల 29 లక్షల 18 వేల 400 కాగా, కేంద్రం చెల్లిస్తున్నది కేవలం రూ.82,29,600 మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటాను 80 శాతానికి పెంచి భరిస్తోందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం
ఈ పథకం పుట్టినప్పుటి నుంచి కష్టపడుతున్న. ఏదో ఒక రోజు మంచి జరుగుతదని నా లెక్కనే చానా మంది పని చేత్తన్రు. నెలకు వెయ్యిస్తే ఏమస్తది సారు. ఇప్పుడు మా బాధలు చూడలేక కేసీఆర్ సారు రెండు వేలు పెంచిండట. చానా సంతోషమైతంది. నాకు ఇప్పుడు మూడు వేలు వస్తయని ఆశపడ్తన్న. ఇక సెంట్రల్ సర్కార్ సుతం పెంచితే మాకు ఇంకింత మంచైతది. కేసీఆర్ సారన్న మా బాధలు పట్టించుకున్నడుగానీ మోడీ సారు ఎందుకు పట్టించుకుంట లేడు. మేమంతా ఇట్లనే కష్టపడుకుంట సావాల్ననుకుంటున్నడా.. మా బాధలు పట్టిచ్చుకోవాలె. కట్టెలకు మస్తు కష్టమైతంది. బియ్యం ఇచ్చినట్లే గ్యాసు సుతం సప్లయ్ చెయ్యాలె.
– మామిడి లక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, బొమ్మనపల్లి
కేంద్రం కూడా పెంచితే బాగుంటుంది
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేలు అదనంగా గౌరవ వేత నం ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చాలా మంచి పరిణామం. గౌరవ వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 80 శాతానికి పెరిగింది. ఇప్పుడు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇస్తున్న రూ.3 వేల వేతనంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.2,400 ఇస్తోంది. ఇందు లో కేంద్ర ప్రభుత్వం తన 60శాతం వాటా ప్రకారం గౌరవ వేతనం పెంచితే నిర్వాహకులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాం.
– కానిగంటి రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు, బొమ్మనపల్లి (చిగురుమామిడి)