పెద్దపల్లి, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనలతోనే తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి, ఫలితాలు సాధిం చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ, ఎంబీసీ కుల వృత్తుల, చేతి వృత్తుల లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెకుల పంపిణీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ పత్రాల అందజేత కార్యక్రమాలకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్లో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు తీసుకవచ్చి దేశానికే దిక్చూచిగా నిలిపారని కొనియాడారు. గత పాలకులు దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తు చేశారు. నాడు 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించే తెలంగాణ నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా పండిస్తుందని తెలిపారు.
కుల వృత్తులకు పునర్జీవం..
కనుమరుగువుతున్న కుల వృత్తులకు పునర్జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. దీని కోసం ప్రత్యేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. బీసీ కుల వృత్తులు, మైనారిటీ వర్గానికి చెందిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మొదటి విడుతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మందికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో భాగంగా జిల్లాలో 900 మందికి రూ.9 కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఇండ్లను కేటాయించిందని, జిల్లాకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. ఇంటి స్థలం లేని వారిని గుర్తించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి పంపిణీ చేస్తామన్నారు.
మానవతావాది వ్యక్తి సీఎం కేసీఆర్
గతంలో వెట్టి చాకిరీ చేసిన చిరుద్యోగులను ఆదరించే అంశంలో సీఎం కేసీఆర్ మానవీయ కో ణంలో ఆలోచిస్తారని, ఇందులో భాగంగానే వీ ఆర్ఏలను రెగ్యులరైజ్ చేశారని, జూనియర్ పం చాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ చే స్తున్నారని మంత్రి తెలిపారు. జిల్లాలో 29 మందికి గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా రెగ్యులర్ అ య్యారని, మిగిలిన వారికి పది రోజుల్లో రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ అందజేస్తామని తెలిపారు.
ధరణి సహాయ కేంద్రం ప్రారంభం
సమీకృత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధరణి సహాయ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ప్రారంభించారు. భూ సమస్యలు ఉన్నవారు పరిషారం కోసం అనుసరించాల్సిన విధానంపై ధరణి సహాయక కేంద్రం సంపూర్ణ సహాయం అందిస్తుందని, సందేహాలున్న వారు నేరుగా సంప్రదించవచ్చని, అలాగే ఫోన్ నెంబర్ 7995070677 నెంబర్లో సంప్రదించాలని మంత్రి తెలిపారు. కలెక్టరేట్లో ఈవీఎం యంత్రం, వీవీ ప్యాట్ల పనితీరుపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన కేంద్రాన్ని మంత్రి పరిశీలించి ఈవీఎం పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవీ శ్యాంప్రసాద్లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, పెద్దపల్లి ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పది రోజుల్లో పూర్తి చేస్తాం
జిల్లాలోని 186 జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో 112 మంది నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 29 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన అభ్యర్థులకు పది రోజుల్లో రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తవుతుంది. బీసీ కుల వృత్తులకు ఆర్థికసాయం పంపిణీ కోసం జిల్లాకు ప్రభుత్వం రూ.9 కోట్లు విడుదల చేసింది. ఎమ్మెల్యేల సమక్షంలో లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెకులు పంపిణీ చేస్తాం. జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అర్హులకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం. ఈ నెల 10 వరకు అందిన గృహలక్ష్మి దరఖాస్తులను ఇదే నెల 20లోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధి చేకూరుస్తాం.
– ముజమ్మిల్ఖాన్, కలెక్టర్ (పెద్దపల్లి)
పనితీరును బేరీజు వేసుకోవాలి
గత ప్రభుత్వాల, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలి. అప్పుడున్న అధ్వాన పరిస్థితుల నుంచి నేడు అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో ఆలోచన చేయాలి. పని చేసే ప్రభుత్వానికి అండగా నిలువాలి. అప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుంది. బీసీలకు అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రతి నెలా నిరంతరాయంగా కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి తప్పనిసరిగా సాయం అందుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో త్వరలో గృహలక్ష్మి పథకం, దళిత బంధు పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తాం.
– దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే, పెద్దపల్లి
చివరి లబ్ధిదారుడికీ ఆర్థికసాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వాలు ఆలోచించని విధంగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు ప్రతి నెలా ఆసరా పింఛన్ అందిస్తున్నది. ఇప్పుడు బీసీ కుల వృత్తిదారులకు దశలవారీగా ఆర్థికసాయం చేస్తున్నది. చివరి లబ్ధిదారుడి వరకు తప్పనిసరిగా సాయం అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్, పెద్దపల్లి