జగిత్యాల రూరల్, మే 24 : జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో 42మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రి హరీశ్రావు ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 21,800 ఉద్యోగాలు వైద్య శాఖలో నియామకం చేశారన్నారు.
గతంలో పాత బస్టాండ్లో వంద పడకల దవాఖాన ఉండగా నేడు కొత్త బస్టాండ్లో 230 పడకలతో జనరల్ ఆసుపత్రి (మాతా శిశు) ఏర్పాటు చేశారని, మంత్రి హరీశ్రావు కృషితో రూ.14 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు ద్వారా 50 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 100 నుంచి అదనంగా 300 పడకలకు జనరల్ దవాఖాన సామర్థ్యం పెరిగిందని, రాష్ట్రంలో ఎన్ఎంసీ జగిత్యాల మెడికల్ కాలేజీకి మొట్టమొదట అనుమతి ఇచ్చిందని, రెండో విద్యా సంవత్సరానికి కూడా అనుమతి వచ్చిందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ 42 మంది కొత్త వైద్యులను కేటాయించిందని, జిల్లా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, జోగిన్పెల్లి సందీప్ రావు, సీనియర్ నాయకులు బాలే శంకర్, రాంమోహన రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.