కరీంనగర్, మే31(నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు సంబురంగా సాగుతున్నది. ప్రధానంగా కాళేశ్వర జలాల రాకతో సాగునీటి గోస తీరింది. కాలంతో సంబంధం లేకుండా జలాలు పరుగులు తీస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళలాడుతుండగా, చెరువులు, కుంటలు ఎండకాలంలో నూ నిండుగా కనిపిస్తున్నాయి. అంతటా భూగర్భజలాలు కూడా అమాంతం పెరిగాయి. మెట్టప్రాంతంలోనూ గోదావరి జలాలు సవ్వడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా సాగునీటి తిప్పలు లేకుండా పోయాయి. దాంతో రైతులు సాగుకు సంబురంగా కదులుతున్నారు. సాగునీటితోపాటు 24గంటల కరెంట్, రైతుబంధు ఇస్తుండడంతో ఉత్సాహంగా ముందుకు ‘సాగు’తున్నారు. రోహిణి కార్తెకు ముందే నారు పోసుకుంటున్నారు. పంట చేలను సిద్ధం చేసుకొని, ఎరువులు, విత్తనాలు తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇటు వ్యవసాయ అధికారులు జిల్లాల వానకాలం సీజన్ సాగు అంచనాలు ఇప్పటికే రూ పొందించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,05, 351 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని, అందులో సింహభాగం 9,46,515 ఎకరాల్లో వరి, ఆ తర్వాతి స్థానంలో 207737 పత్తి వేస్తారని అంచనా వేశారు.
నకిలీ విత్తనాలపై నిఘా
నకిలీ విత్తనాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులు మోసపోకుండా ఉం డేందుకు పకడ్బందీ చర్యలు తీసకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధర్యంలో అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి, వరి సీడ్ విక్రయాలపై ఎన్నడూ లేనివిధంగా నిఘా పెట్టారు. ముమ్మర తనిఖీలు చేస్తూ, ఎక్కడా తేడాలున్నా కొరడా ఝులిపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో సీపీ సుబ్బారాయుడుతోపాటు డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ కూడా జిల్లాలోని పలు దుకాణాలను తనిఖీ చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు నకిలీలపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక నంబర్లను కూడా కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో టాస్క్ఫోర్స్ అధికారులుగా వ్యవసాయ శాఖ తరఫున ఏడీఏ అంజని (7288894115), పోలీస్ శాఖ తరపున సీఐ సృజన్ కుమార్ రెడ్డి (9440034561)కి సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. జగిత్యాల జిల్లాలో 7288894124, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8712656411, పెద్దపల్లి జిల్లాలో 7288894148 నంబర్లను కేటాయించారు.
కరీంనగర్ జిల్లాలో 3.39 లక్షల ఎకరాలు
కాళేశ్వరం జలాల రాకతో వరి సాగే ఏటా టాప్లో ఉంటున్నది. కరీంనగర్ జిల్లాలో వానకాలం సీజన్ చూస్తే ఏయేటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉన్నది. 2016లో కేవలం 81,755 ఎకరాలు.. 2017లో 1,15,423.. 2018లో 1,34,949.. 2019లో 1,95,83 6.. 2020లో 2,52,952.. 2021లో 2,72, 951.. 2022లో 2,72,407 ఎకరాల్లో సాగైం ది. ఈ గణాంకాల ప్రకారం 2023 వానకాలం సీజన్లో మొత్తం 3,39,500 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, అందులో సింహభా గం 2,72,500 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత స్థానం లో పత్తి 48వేల ఎకరాలు, మక్క 4,500, మిర్చి వెయ్యి, కందులు 2,500, పెసరా 1000, మినుములు 5, ఇతర పప్పు దినుసులు 40, పల్లి 300, నువ్వులు 25, ఆముదం 5, పొ గాకు 100, పసుపు మరో 100, ఇతర ఆహార పంటలు 9 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు తెప్పించే పనిలో పడ్డారు. యూరియా 43,637 క్వింటా ళ్లు, డీఏపీ 7,412, ఎంవోపీ 6,375, కాంప్లెక్స్ 20,627, ఎస్ఎస్పీ 1,000, సిటీ కంపోస్ట్ 550 కలిపి మొత్తం 79,601 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే విత్తనాల కోసం కూడా అంచనా లు సిద్ధం చేశారు. ఇప్పటికే జీలుగ విత్తనాలను అందుబాటులో ఉంచారు. మొత్తంగా చూస్తే గ తంలో పోలిస్తే పంటలసాగు విస్తీర్ణం గణనీయం గా పెరిగింది. 2016లో 2,53,463 ఎకరాల్లో సాగవగా, అది 2022లో 3,36,137 ఎకరాలకు పెరిగింది. ఈసారి 3,39,500 ఎకరాలకు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
జగిత్యాల జిల్లాలో 4.42 లక్షల ఎకరాలు
జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సీజన్ పంటల సాగు అంచనాలు సిద్ధం చేశా రు. మొత్తం 4,42,980 ఎకరాల్లో వివిధ పంట లు సాగు చేస్తారని అంచనా వేశారు. వరి 2,98,500 ఎకరాలు, మక్క 40,875, కందు లు 5,125, పెసర 300, మినుములు 1, అలసంద, అనుములు 675, సోయాబిన్ 1875, పత్తి 19,745, చెరుకు 1200, పసుపు 18, 750, ఆయిల్పామ్ 4800, ఇతర పంటలను 36,250 ఎకరాల్లో వేస్తారని ప్రకటించారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు తెప్పించే పనిలో తలమునకలయ్యారు.
సిరిసిల్లలో 2.40 లక్షల ఎకరాలు
నాడు మెట్టప్రాంతంగా ఉన్న సిరిసిల్లలో కరువు తాండవించేది. ఇప్పుడు కాళేశ్వరం జలాలతో జిల్లా సస్యశ్యామలంగా మారింది. ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు ఏకంగా ఆరు మీటర్లపైకి చేరాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాడు 90 వేల ఎకరాల్లోనే పంటలు వేయగా, నేడు అది 2లక్షల ఎకరాలకుపైగా చేరింది. ఈ సారి వానకాలం యాక్షన్ ప్లాన్ సిద్ధంకాగా, 2,40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా వరి 1.62 లక్షల ఎకరాలు, తర్వాత పత్తి 74,492 ఎకరాలు, కంది 1756, మక్క 1347, పెసలు 97, అలసంద 3 ఎకరాలు, మిగతా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు వేస్తారని లెక్క గట్టింది. వరిలో దొడ్డు రకంతోపాటు సుమారు 30వేల ఎకరాల్లో సన్నరకం సాగు చేసే అవకాశముందని చెబుతున్నది. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు తెప్పించే పనిలో పడింది. వరి విత్తనాలు 32,407 క్వింటాళ్లు, మక్క 108, కందులు 70.24 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 8 క్వింటాళ్లు, పత్తి 2,45,868 ప్యాకెట్లు అవసరమని అంచనా రూపొందించింది. యూరియా 32,480, డీఏపీ 4,500, ఎంవోపీ 6వేలు, ఎన్పీకేఎస్ 15వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పంపించింది.
పెద్దపల్లిలో 2.81 లక్షల ఎకరాలు
జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సీజన్ పంటల సాగు అంచనా రూపొందించారు. 2,83,321 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. అందులో వరి 2,13,515 ఎకరాలు, పత్తి 65,500, మక్క 1305, ఇతర పంటలు 2,701 ఎకరాల్లో వేయనున్నారు. అందుకు సరిపడా 33,046 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉంచారు.