Ramagundam Lions Club | కోల్ సిటీ, జూన్ 27 : ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా నిత్యన్నదానానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం గోదావరిఖని కూరగాయల మార్కెట్ వద్ద మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా వెయ్యి రోజుల వేడుకగా ఉచిత అల్పాహార వితరణ చేపట్టారు. మేయర్ ముఖ్యఅతిథిగా హాజరై క్లబ్ సభ్యుల సేవలను కొనియాడారు.
రామగుండం లయన్స్ క్లబ్ కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదని, ఎంతోమంది పేదలకు అన్నం పెడుతున్న అక్షయపాత్ర అని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులంతా ఒక కుటుంబం కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండడమే కాకుండా సమాజహిత కార్యక్రమాల్లో ఇతర స్వచ్ఛంద సంస్థల కంటే ముందు వరుసలో ఉండడం అభినందనీయమని తెలిపారు. గత వెయ్యి రోజులుగా నిర్విఘ్నంగా నిత్య అన్నదానం చేయడం అంటే సాధారణ విషయం కాదన్నారు.
అన్నదానమే కాకుండా వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం, పేద పిల్లలకు జీవనోపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లు, విద్యార్థులకు, నిరుపేదలకు చేయూత అందించడం లయన్స్ క్లబ్ గొప్పతనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ రామస్వామి, జోన్ చైర్ పర్సన్ దాని పరిస్థితి గోపాల్ రావు, కజంపురం రాజేందర్, తిలక్ చక్రవర్తితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.