తెలంగాణ చౌక్, ఆగస్టు 5: ప్రతి ఒక్కరూ ట్రాఫి క్ నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద ఇండియన్ యూత్ సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్(ఆర్ఎస్సీ), ట్రాఫిక్ రూల్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్ఎస్సీ కార్యక్రమాల్లో భాగంగా రెండు నెలల పాటు స్కూళ్లు, కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్పై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా అందులో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘సూపర్ హీరో’ అవార్డును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ఫ్రీగా లైసెన్స్లు అందజేస్తామని చెప్పారు.
దేశ పురోగతిలో కీలకభూమిక పోషిం చే యువత, చిన్నచిన్న తప్పిదాల వల్ల రోడ్డు ప్ర మాదాల్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ ధరించాలని కోరారు. విద్యార్థులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు తమ వెంట హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు ఉంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యపరుస్తున్న ఎన్జీవో సభ్యుడు ఓజాను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, ఎన్జీవో ఓజా, వాహనదారులు, వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉన్నారు.