‘స్వచ్ఛ’తలో రాజన్న సిరిసిల్ల జిల్లా మరోసారి మెరిసింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థానం కైవసం చేసుకున్నది. అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో మోడల్గా డిక్లేర్ చేసినందుకు దేశంలోనే ప్రథమస్థానం దక్కించుకున్నది. ఈ ఘనత సాధించినందుకు డీడీడబ్ల్యూస్ తన అధికారిక ట్విట్టర్లో జిల్లా అధికారులను వెల్డన్ అంటూ ప్రశంసించింది. మంత్రి కేటీఆర్ సైతం హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారయంత్రాగాన్ని అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షన్లో మొదటిస్థానం వచ్చినందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కేకులు కోసి సంబురాలు జరుపుకున్నారు.
రాజన్నసిరిసిల్ల (నమస్తే తెలంగాణ)/సిరిసిల్లటౌన్/ కలెక్టరేట్, డిసెంబర్ 3 : స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థానం సాధించింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో మోడల్గా డిక్లేర్ చేసినందుకు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్- అవార్డుకు ఎంపిక కావడంపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, అదనపు డీఆర్డీవో మదన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సింగిల్విండో చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రామ్మోహన్రావు, కేడీసీసీబీ డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రాంమోహన్, మ్యాన రవి, ఎండీ సత్తార్, తదితరులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రతిగా మంత్రికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం వళ్లే సాధ్యమైంది’ అంటూ రీట్వీట్ చేశారు.
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2023 4స్టార్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటి స్థానం సాధించిన విషయాన్ని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తాగునీరు-పారిశుధ్య మంత్రిత్వ శాఖ(డీడీడబ్ల్యూఎస్) తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వెల్ డన్ అంటూ జిల్లా అధికారులను ప్రశంసించింది.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో భాగంగా దేశంలోనే మొదటి స్థానం దక్కడం మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితమే. మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, డీఆర్డీవో, డీపీవో, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పారిశుధ్య సిబ్బంది, కార్మికులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఉత్తమ సేవలు అందించిన వారి సేవలను ప్రశంసిస్తూ ప్రతి మండలంలో సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2023లో అగ్రభాగాన నిలపాలి.
– కలెక్టర్ అనురాగ్ జయంతి
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ పల్లెలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా వర్ధిల్లుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరినీ స్వచ్ఛ గ్రామాల నిర్మాణంలో ప్రభుత్వం భాగస్వాములను చేసింది. గ్రామ పంచాయతీల అభ్యున్నతి కోసం సీఎం విశేష కృషి చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు స్వాగత తోరణాలుగా మారాయి. మొక్కల సంరక్షణకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లను అందించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఉంటూ స్వచ్ఛతపై నిరంతరం శ్రమించారు. గ్రామాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అందించిన స్ఫూర్తితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామపంచాయితీ సిబ్బంది, ప్రజలందరి సహకారంతో నేడు దేశంలోనే మొదటిస్థానం సాధించాం.
– జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించింది. బహిరంగ మల, మూత్ర విసర్జనపై నిషేధం విధించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కోసం అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు ప్రజల ఇండ్లలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి సర్కారు చర్యలు తీసుకున్నది. తద్వారా సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా మారాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందించిన తోడ్పాటుతో దేశానికే మార్గదర్శకంగా నిలిచేలా స్వచ్ఛ సర్వేక్షన్లో మొదటిస్థానం సాధించింది.
– టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య