ఎల్లారెడ్డిపేట, జూన్ 13: పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి మండలాని చెందిన ఎందరికో విద్యనందించిన నిజాంకాలం నాటి పెద్దబడి కూల్చివేత సందర్భంగా కేటీఆర్ ఓ అద్భుతమైన పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఆనాటి నాయకులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అదే అర్కిటెక్చర్ తీరులో మళ్లీ నిజాం కాలంనాటి పెద్దబడి రూపుదిద్దుకుంది. సీఎస్ఆర్ నిధులతో రూ.7.5 కోట్లతో చేపట్టిన నూతన ఉన్నత పాఠశాల భవన నిర్మాణాన్ని గీవ్స్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ కొండూరి సాకేత్ పర్యవేక్షణలో సకల హంగులతో నూతన బడి నిర్మాణం పూర్తయ్యింది. కార్పొరేటు పాఠశాలలకు దీటుగా 48 కంప్యూటర్లతో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేలా నిర్మించారు. 4 వందల మంది ఒకేసారి భోజనం చేసేలా డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు.
పెద్దబడిలో పాఠాలు చెప్పేందుకు ఓకే.. కానీ ఆటల కోసం పీడీ రాందాస్ రెండేండ్ల కింద జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా డిప్యూటేషన్పై బదిలీ అయ్యారు. దీంతో మోడల్ పాఠశాలలో విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు, ఆటలపై శిక్షణ ఇచ్చేందుకు పీడీ లేక విద్యార్థుల శారీరక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతున్నది. పాఠశాలలో చదువు ఓకే మరి ఆటల సంగతేమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు ప్రతి రోజు ఆటల కోసం ప్రత్యేక పీరియడ్ ఉండగా 8,9 తరగతి విద్యార్థులకు వారంలో రెండు రోజులు ఆటల కోసం ప్రత్యేక పీరియడ్స్ ఉండగా సదరు పీరియడ్స్లో ఆటలు ఆడించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్నట్లు కొందరు ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.