రాజన్న సిరిసిల్ల, మే 26 : దళిత బంధు పథకాన్ని లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం ఐడీవోసీ మినీ మీటింగ్ హాల్లో తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన 30 మంది దళిత బంధు పథకం లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సమావేశం అయ్యారు.
రెండు గంటలకు పైగా సాగిన సమావేశంలో ఒక్కో లబ్ధిదారుడితో జిల్లా కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. ఎంపిక చేసుకున్న యూనిట్లు, అనుభవం, ఆసక్తి , డిమాండ్, నిర్వహణ ప్రణాళిక, మార్కెటింగ్, ఉద్యోగ కల్పన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూలీలుగా పనిచేస్తున్న మీకు మరో నలుగురికి ఉపాధి నిచ్చేలా ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా దళిత బంధు ద్వారా యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
సీఎం కేసీఆర్ మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి యూనిట్ ను సక్సెస్ చేసేలా చూడాలన్నారు. మొక్కలను జాగ్రత్తగా పెంచివృక్షాలుగా ఎదిగేలా చూసినట్టు వ్యాపార వృద్ధిని సాధించాలని అన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ లకు సంబంధించి రికమెండేషన్ రిపోర్ట్ ను వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు మోస పోకుండా వెండర్లతో అధికారులే మాట్లాడాలన్నారు.
నాణ్యమైన వస్తువులు సరఫరా చేసేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, డీఆర్డీఓ మదన్ మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్, జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి కొమురయ్య, తంగళ్లపల్లి ఎంపీడీవో లచ్చాలు, తదితరులు పాల్గొన్నారు.