Sircilla SP | సిరిసిల్ల టౌన్, మే 2: డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగల వారిగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు.
ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాదకద్రవ్యాల వల్ల వచ్చే అనార్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలలని సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.