ఇబ్రహీంపట్నంరూరల్, మే 22 : జిల్లావ్యాప్తంగా ఎండాకాలం దున్నకాలు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడంతో కలుపు, చీడపరుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడి పొందవచ్చునే అధికారుల సూచనలతో అన్నదాతలు వ్యవసాయ పొలాల దున్నకాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పొలాల్లో ఎలాంటి పంటలు లేనందున లోతుగా దుక్కులు దున్నుకుంటే ఏ పంట వేసినా అధిక దిగుబడి ఎక్కువగా సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో పొంటపొలాల్లో దున్నుకాలు ప్రారంభించి వానకాలానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు వినియోగిస్తూ అధికారుల సూచనతో పంటలు సాగుచేస్తే వ్యవసాయం మంచి లాభసాటిగా మారుతుందని చెబుతున్నారు వ్యవసాయాధికారులు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నడాన్ని ప్రారంభించారు. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే వరిపంటలు కోసి పొలాలను శుద్ధి చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేసవి దుక్కుల దున్నుకాలను రైతులు ప్రారంభించారు.
దుక్కులు లోతుగా దున్నుకోవాలి..
దుక్కులను లోతుగా దున్నడం వల్ల నేల వదులై మెత్తగా తయారవుతుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే నీరు పల్లంవైపు పొర్లకుండా ఎక్కడికక్కడే పొలంలోనే ఇంకిపోతుంది. భూమికి ఎక్కువరోజులు తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల పైరువేసిన తర్వాత వర్షాలు పడటం కొద్దీగా ఆలస్యమైనా పంటకు నష్టం జరుగదు. పంటల కోతల తర్వాత నేలపై మిగిలేపంట మొదళ్లు, పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకుల వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుల్లిపోయి ఎరువుగా మారుతాయి. దీంతో నేలలో సేంద్రియ పదార్థాలు, పోషకవిలువలు పెరుగడానికి అవకాశం ఉంటుంది. లోతు దక్కులు దున్ని సిద్ధం చేసుకుంటే వానకాలానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
మందలు పెట్టుకుంటే పొలానికి ఎంతో బలం
వేసవిలో పొలాల్లో ఎలాంటి పంటలు ఉండవు. కాబట్టి రైతులు వేసవిలో తమ పొలాల్లో పశువులు, గొర్రెల మందలు పెట్టుకుంటే మంచిది. పశువులు, గొర్రెలను పొలంలో మందలు కట్టడం రైతులకు పాత విషయమే, కాబట్టి ఆ పని వేసవిలో చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పొలంలో మందలను కట్టిన సమయంలో మల, మూత్రాలు విసర్జిస్తాయి. దీంతో చేనుకు అవసరమైనంత ఎరువు లభించి పొలానికి అదనపు బలం చేకూరుతుంది.
లోతు దుక్కులతో వేరువిస్తరించే అవకాశం
వేసవిలో లోతుగా దుక్కులు దున్ని తొలకరి జల్లు కురిసిన తర్వాత గొర్రుతిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతెల వంటి పరికరాలు నేల లోపలికి 3 నుంచి 6 అంగులాల వరకు చొచ్చుకునిపోతాయి. ఈ పరికరాలు తరచూ ఉపయోగించడం వలన నేల లోపల సుమారుగా 3నుంచి 5 అంగులాల లోతులో ఒకగట్టి పొర ఏర్పడుతుంది. దీంతో నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. వేసవిదుక్కుల సమయంలో నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టిపొర ఛేదించబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది.
మొండిజాతి కలుపు నివారణ..
పొలాల్లో వేసవి దుక్కులు దున్నినప్పుడు కలుపు మొక్కలు, కాయలు, వేర్లు, దుంపలు పెకిలించబడి వేసవిలో ఉండే ఉష్ణోగ్రతలకు అవి నశించడానికి ఆస్కారం ఉంటుంది. దుక్కిదున్నిన తర్వాత నేలపైకి తేలిన కాయలు, దుంపలు ఏరివేసుకుంటే పొలం శుభ్రంగా తయారవుతుంది. తుంగ, గరిక, గుంజర వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో అధికంగా పెరిగి పంటలను నాశనం చేస్తుంటాయి. కాని వేసవి దుక్కులు లోతుగా తీయడంతో పొలంలొని చీడలు నాశనమయ్యే అవకాశమున్నందున రైతులు అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
అధిక దిగుబడులకు అవకాశం
వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకోవాలి. తొలకరిలో కురిసే వర్షాలకు నీరు భూమిలో ఇంకిపోయి పొలం తడిగా మారే అవకాశం ఉంటుంది. దీంతో పంటల దిగుబడిసైతం పెరిగే వీలున్నందున రైతులు వరిపంటలు కోయడంతో పాటు ఇతర పొలాల్లో ఎలాంటి పంటలు లేనందున రైతులు వేసవి దుక్కులను లోతుగా దున్నకుంటే అధిక దిగుబడులు సాధించుకునేందుకు అవకాశముంటుంది.
– శ్రవణ్కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం
ఎండలో దున్నకాలు చేపట్టాలి
పంటలు తీసుకున్న తర్వాత వెంటనే భూములు దున్నితే భూమికి బలం చేకూరుతుంది. రాలిన ఆకులతో భూమికి మల్చింగ్చేసినట్లు అవుతుంది. అప్పుడే భూమి బాగా మరిగి పంటలు దిగుబడి ఎక్కువగా వస్తుంది. వరిపంట కోసిన వెంటనే పొలం దుక్కులు దున్ని పెట్టుకుంటే వర్షాలు పడే నాటికి భూమిలో మంచి బలం చేకూరుతుంది. తొలకరి పలకరించిన వెంటనే ఎలాంటి పంటలువేసుకున్నా దిగుబడి బాగుంటుంది.
– మొద్దు అంజిరెడ్డి, రైతు