రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్/ సిరిసిల్లరూరల్ : చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు. వరంగల్ జిల్లాలో 1250 ఎకరాల్లో అద్భుతంగా ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కునకు నయాపైసా సాయం అందించలేదని ధ్వజమెత్తారు. గురువారం సిరిసిల్లకు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నేత కార్మికులనుద్దేశించి మాట్లాడారు.
క్లస్టర్లు అడిగినా ఇవ్వలేదు
మరమగ్గాలు, చేనేత పరిశ్రమకు రంగులు, రసాయనాలు, నూలు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. పొట్టకూటి కోసం సూరత్, భీవండీ, షోలాపూర్కు వలస వెళ్లిన కార్మికులను తిరిగి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. చేనేత, మరమగ్గాలను ఆధునీకరించడంతో పాటు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, యూనిఫాంలు, అంగన్వాడీ టీచర్ల చీరల తయారీ ఆర్డర్లు ఇస్తూ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని గుర్తు చేశారు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు కేంద్రం ఏదైనా సాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్న కార్మికులకు మొండి చేయి చూపిందని మండిపడ్డారు. చేనేత చేయూత, త్రిప్టు పథకం ద్వారా కార్మికుడు రూ.రెండు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.రెండు కట్టి బ్యాంకులో జమ చేస్తూ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి కార్మికుడికి చెల్లించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి కేంద్రం తనవంతు సాయం చేస్తే వస్త్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. అందులో భాగంగా దుబ్బాక, జమ్మికుంట, కమలాపూర్, నారాయణపేట, సిద్దిపేట, గద్వాల, కొత్తకోటలో చేనేత క్లస్టర్లు ఇవ్వాలని కోరినా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. మెగా పవర్లూం క్లస్టర్ ఇస్తే జాతీయ స్థాయిలో సిరిసిల్లకు గుర్తింపు వస్తుందని, ఇచ్చల్ కరంజీ మాదిరిగా అభివృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంటుందని ఆశించినా కేంద్రం కనికరించలేదన్నారు.
అప్పారెల్ పార్కుతో మహిళలకు ఉపాధి
ఓట్లేసి గెలిపించిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి కేటీఆర్ పునఃరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చి ఆశీర్వదించారని, సిరిసిల్ల పట్టణాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతానని చెప్పారు. శాంతి భద్రతలు బాగుండాలని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో పలానా చోట మోరీ లేదనో? సీసీ రోడ్లు లేవనో? మాట రావద్దని అధికారులకు సూచించారు. విలీన గ్రామాలతోసహా అన్ని గ్రామాలను సమదృష్టితో అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు తయారు రూపొందించి తనకు పంపితే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
శోభయామానంగా మార్కండేయుడి జయంతి
వస్త్ర పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్లలో శ్రీ మార్కండేయుని జయంతి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన శ్రీమార్కండేయుని శోభయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూ డూరు ప్రవీణ్, పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ గడ్డం నర్స య్య, కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఆర్వో శ్రీనివాసరావు, ము న్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బొ ల్లి రామ్మోహన్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బా లయ్య, ప్రధాన కార్యదర్శి దిడ్డిరాజు, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మండల సత్యం, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.
బాలుడి కిడ్నీ మార్పిడికి అమాత్యుడి భరోసా
మంత్రి కేటీఆర్ మరోసారి ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేంద్రానికి చెందిన 13 ఏళ్ల లింగం తరుణ్ మూడు నెలల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబంమైనా తల్లిదండ్రులు లత-శ్రీనివాస్ సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి హైదరాబాద్లో వైద్యం చేయంచారు. కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో ఆందోళన చెందారు. గురువారం తంగళ్లపల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్ను కలిసి ఆదుకోవాలని వేడుకున్నారు. వెంటనే చలించిన మంత్రి వారికి భరోసానిచ్చారు. నిమ్స్లోని వైద్యులతో మాట్లాడి బాలుడి కిడ్నీ మార్పిడి చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే అక్కబ ఉన్న టీఆర్ఎస్ నేత పడిగెల రాజుకు శనివారం బాలుడిని నిమ్స్కు తీసుకురావాలని సూచించారు.
కేసీఆర్ ఆశయసాధనకు పనిచేస్తా
సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఆయన ఆశయసాధన కోసం పని చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తాను 27 ఏండ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నానని, నూతన అనుభవంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు
– ఎమ్మెల్సీ ఎల్.రమణ