సిరిసిల్ల టౌన్, మే 15: సిరిసిల్ల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీలోని 3వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సిఫార్సుతో రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు మంజూరు చేసిన రూ.6 లక్షలు నిధులతో పాటు మున్సిపల్ జనరల్ ఫండ్ రూ. 3 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నేతలు, మహిళలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో వార్డులో ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్డు పనులు చేపట్టామన్నారు. త్వరలోనే పాఠశాల ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా చేపడతామన్నారు. ప్రస్తుతం చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు గతంలోని నిధులు మంజూరయ్యాయని, పాలకవర్గం గడువు ముగియడంతో జాప్యం జరిగిందన్నారు. మళ్లీ మూడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించి, కేటీఆర్ సహకారంతో చైర్పర్సన్ గా కావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలకు తాను రుణపడి ఉంటామని, అభివృద్ధికి కట్టుబడి పనులు చేస్తామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీ దామోదర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్, సింగల్ విండో డైరెక్టర్ గడీల సురేష్, మ్యాన రవి, వంకాయల కార్తీక్, శ్రీనివాస్, మోతే మహేష్, జిందం దేవదాస్ ఉన్నారు.