రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండల శివారులోని చెక్ డ్యాంలో 9 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఆరుగురు గల్లంతైన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటి వరకూ ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈతకు వెళ్లిన 9 మందిలో వాసల కళ్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ క్షేమంగా ఉన్నారు.
మిగిలిన ఆరుగురి కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నాడు 8వ తరగతి విద్యార్థి అయిన కొలిపాక గణేష్(14) డెడ్ బాడీ దొరికింది. మిగిలిన వారి కోసం రాత్రి పూట కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం జడల వెంకట సాయి(14) మృతదేహం లభించింది. ఇతను కూడా 8వ క్లాస్ చదువుతున్న విద్యార్థే.
ఆ తర్వాత కాసేపటికి 6వ తరగతి విద్యార్థి కొంగ రాకేష్(12), 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్ క్రాంతి కుమార్(14), 9వ తరగతి విద్యార్థి అజయ్(13) మృత దేహాలు లభించాయి. వీరందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన రాజీవ్ నగర్ వాసులని అధికారులు గుర్తించారు.
సిరిసిల్లలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వీరంతా ఈత కొట్టేందుకు మానేరు వాగుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియెట్ విద్యార్థి అయిన సింగం మనోజ్(16 ) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతని మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్.. స్వయంగా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇదిలా వుండగా, ఇప్పటి వరకూ లభించిన మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబాల రోదనలతో ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వారిని పరామర్శించేందుకు జడ్జీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ కళ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.