తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 21: ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అదనంగా 1060 బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ తెలిపారు. ఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ ఛార్జీలతో అదనపు బస్సులను నడిపించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ జూబ్లీ స్టేషన్ వరకు, జూబ్లీస్టేషన్ నుంచి కరీంనగర్కు నడిపిస్తామన్నారు.
ఈ నెల 26 తేదీ నుంచి సెలవులు ప్రకటించడం, అక్టోబర్ 3 తేదీన బతుకమ్మ, 5 తేదీన దసరా పండుగల సందర్భంగా జూబ్లీ బస్స్టేషన్ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణాలకు బస్సులు నడిపిస్తామన్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి కరీంనగర్ బస్స్టేషన్ నుంచి జూబ్లీ వరకు ప్రత్యేకంగా అదనపు బస్సులను నడుపుతామని వివరించారు. జూబ్లీ స్టేషన్ నుంచి ఈనెల 23 నుంచి అదనంగా 50 బస్సులు, 24న 100 బస్సులు, 25న 50 బస్సులు, 30న 50 బస్సు లు, అక్టోబర్ 1న 70 బస్సులు, 2న 105 బస్సులు, 3న(బతుకమ్మ రోజు) 80 బస్సులు 4న 50 బస్సులు, 5న (దసరారోజు) 5 బస్సులను నడుపుతామని తెలిపారు. కరీంనగర్ స్టేషన్ నుంచి ఈనెల 26వ తేదీన 30 బస్సులు, అక్టోబర్ 6న 90 బస్సులు, 7న 80 బస్సులు, 8న 80 బస్సులు, 9న 140 బస్సులు, 10న 80 బస్సులు నడుస్తాయని వివరించారు. ముందస్తు టికెట్ బుకింగ్ కోసం www. tsrtconline.in వెబ్ సైట్లో సంప్రదించాలని సూచించారు.