ఎల్లారెడ్డిపేట మే 3 : తాలు తరుగు పేరిట మిల్లలు అధికంగా తూకం వేయాలని హుకుం, దానికి నిర్వాహకులు వంతపాడడంపై చిర్రెత్తుకొచ్చిన రైతులు రాస్తారోకో చేపట్టేందుకు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో గత కొన్ని రోజులుగా 42 కిలోలు తూకం వేయగా రెండు రోజుల నుంచి మిల్లర్లు మరో 500 గ్రాములు అదనంగా తూకం వేయాలని అలాగైతేనే మిల్లులో దింపుకుంటామని నిర్వాహకులతో తెలిపారు. ఐకెపి నిర్వాహకులు ఇదే విషయాన్ని రైతులతో చెప్పగా తాము నష్టపోతామని 42 కిలోలు మాత్రమే పెడతామని కరాకండిగా నిర్వాహకులతో చెప్పేశారు.
దీంతో మిల్లర్లు వరి ధాన్యాన్ని తమ ఇల్లులు దింపుకునేందుకు నిరాకరించడంతో కొనుగోల్లు నిలిచిపోయాయి. శనివారం రైతులు అధికారులకు కొనుగోలు కేంద్రంలో జరిగే నిర్వాకం పై సమాచారము ఇచ్చారు. కొనుగోలు ప్రారంభించక పోతే నిరసన చేస్తామని చెప్పిన స్పందించకపోవడంతో రైతులంతా పదిరలోని కామారెడ్డి- కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అధిక తూకంపై నిరసన చేపట్టారు. అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న ఎస్సై రాహుల్ రెడ్డి రైతుల వద్దకు చేరుకొని అధికారులతో తాను మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం అధికారులతో మాట్లాడి ఇదివరకు ఉన్నట్లుగానే 42 కిలోలు తూకం వేసేందుకు అధికారులు హామీ ఇప్పించడం తో రైతులు శాంతించారు. నిరసన తెలిపితే తప్ప మిల్లర్ల దోపిడీ ఆగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇప్పటికీ 42 కిలోల 500 గ్రాములు తూకం వేస్తుండటం గమనార్హం.