సిరిసిల్ల టౌన్, జూలై 15 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని ఆరోపిస్తూ స్థానిక మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో మిడ్ మానేరులోని కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సిరిసిల్ల మానేరు వాగు నిండుకుండలా ఉండేది అన్నారు. దీంతో భూగర్భ జలాల నీటిమట్టం పెరిగి వ్యవసాయ రంగానికి సాగునీరు, ప్రజలకు అవసరమైన త్రాగునీరు నిత్యం అందుబాటులో ఉందన్నారు.
కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో మిడ్ మానేరు పూర్తిగా ఎండిపోయిందని ఆరోపించారు. దీని కారణంగా సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని కేటీఆర్, హరీశ్ రావు అడిగితే మీ రక్తం పొలాల్లో చల్లండి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును తీవ్ర ఆక్షేపనీయమని విమర్శించారు. వెంటనే కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందించాలని, లేనిపక్షంలో కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాచమల్లు మోహన్, గజభింకర్ చిరంజీవి, సోఫియన్, గడ్డం హరీష్, చిన్న వెంకటేష్, గాజుల మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.