కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 23 : కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుషంగా దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, నిందితులు జైలుకు వెళ్లే వరకు రజక సమాజం తమ పోరాటాన్ని ఆపదని హెచ్చరించారు. ఈ మేరకు కరీంనగర్, హుజూరాబాద్లో ధర్నాలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ రజక మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
శంకరపట్నంలో రజక సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్-వరంగల్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి విరమింపజేశారు. పెద్దపల్లిలో దాసరి ఉష కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మంథనిలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఆయాచోట్ల నాయకులు మాట్లాడుతూ, రజకులను కులం పేరుతో దూషిస్తూ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే కాకుండా, ఎదురు తిరిగినందుకు విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ దాడిలోనే రెండు నెలల పసికందు మరణించడం అత్యంత విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.