ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్ మొదలై నెలన్నర గడుస్తున్నా.. వానలు జాడలేకుండా పోయాయి. ఈ పాటికి జలకళలాడాల్సిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వర్షాలే లేక భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్నాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోతున్నాయి. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి.

ఫలితంగా ఉమ్మడి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఏ ఊరిలో చూసినా బీడు భూములే దర్శనమిస్తున్నాయి. తొలకరి మురిపెంతో అక్కడక్కడ నార్లు పోసినా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. నాటు వేసిన పొలాలు నెర్రెలు బారుతున్నాయి. నాటిన పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి.

మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. ఎల్నినో హెచ్చరికలు ఉన్నా సర్కారు మందుచూపు లేకపోవడం.. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే ఆలోచన చేయకపోవడంతోనే సాగునీటి గోస తీవ్రమైంది. ఎన్నో ఆశలతో సేద్యానికి సిద్ధమైన రైతన్న.. ఈ సారి కాడి ఎత్తేయాల్సిన దుస్థితి వచ్చింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్

