‘తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు అధోగతి పాలయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త రైల్వే లైను కానీ, ఒక్క ప్రాజెక్టును కానీ మోదీ ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదు. కొత్తది ఇవ్వడం కాదు.. గత ప్రభుత్వంలో మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైనే ఇప్పటికీ పూర్తి చేయలేదు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో వేసిన రైల్వేలైను పొడవు వంద కిలోమీటర్ల కన్నా తక్కువే. ఇంతకంటే సిగ్గుచేటు లేదు. నత్తలు కూడా సిగ్గుపడేలా కేంద్ర పనితీరు ఉన్నది. దానికి ఎలాంటి అవార్డులు, బిరుదులు ఇవ్వాలో మాకైతే తెలియడం లేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించాలి. ఈ విషయంపై పార్లమెంటులో నిలదీస్తం. తెలంగాణపై వివక్ష విడిచిపెట్టాలి. ఇక్కడి బీజేపీ ఎంపీలు కేసీఆర్ను తిట్టడం కాదు.. సోయి తెచ్చుకుని తెలంగాణ బిడ్డలుగా ఢిల్లీలో కొట్లాడేందుకు మాతో కలిసి రావాలి.”
– విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా ఎన్నో రకాల హామీలు కేంద్రం ఇచ్చింది.. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నరు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కచ్చితంగా ఇదే చివరి అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉంటే ఆఖరి బడ్జెట్లో భారీ నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ పార్లమెంటు సభ్యులను డిమాండ్ చేస్తున్నా.’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
“తెలంగాణ నిధులు కేంద్రం తిన్నది.. తెలంగాణ ప్రజల చెమ ట, రక్తాన్ని మీ వెనుకబడ్డ రాష్ర్టాలకు వాడుకున్నరు..’ అని ధ్వజమెత్తారు. ‘రూ.3 లక్షల 68 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే మీరు ఇచ్చింది రూ.లక్షా 68 వేల కోట్లు మాత్రమే’ అని చెప్పారు. తొమ్మిదేండ్లలో తెలంగాణకు వీసమెత్తు పనికూడా చేయలేదని, ఇక్కడి ఎంపీలు తెలంగాణకు నయా పైసా పని కూడా చేయలేదని, తాను చెప్పిన మాట తప్పయితే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఈ మేరకు మంత్రి సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ, వరంగల్ మెగా టెక్స్టైల్స్ పార్క్, సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ ఇవ్వాలని అడిగినా కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు మంజూరు చేయాల్సిన నవోదయ విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలల ఊసే లేదని ధ్వజమెత్తారు. గతంలో రైల్వే బోర్డుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సం బంధించి ‘కరీంనగర్ – హసన్పర్తి (62 కి.మీ.) , కరీంనగర్ – మానకొండూర్ – హుజూరాబాద్ – కాజీపేట (61.80 కి.మీ.) కోసం సమర్పించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలు గుర్తు చేసిన మంత్రి కేటీఆర్, వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.