కార్పొరేషన్, ఆగస్టు 12: బీసీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు కేవలం తొమ్మిది గురుకులాలే ఉండేవని, వీటిని 281కి పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలు వెచ్చిస్తూ 54 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నదని తెలిపారు. గురుకులాల్లో చదివే పిల్లలు ఆంగ్లం మాట్లాడడాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎకడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎంను తమ అన్నలా భావించి తెలంగాణ మహిళలు రా ఖీలు కడుతున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల దీవెనలతో సీఎం కేసీఆర్ కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యతా రక్షాబంధన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో సీఎం కేసీఆర్ కటౌట్కు రాఖీలు కట్టారు. తర్వాత స్థానిక కార్ఖానగడ్డలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థినులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతోపాటు మంత్రి గంగుల, మేయర్ సునీల్రావుకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు.
గురుకులాల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా రాజకీయాలపై దృష్టిపెట్టాలని కోరారు. ఒక డాక్టర్ ఫెయిలైతే రోగి మరణిస్తాడని, ఇంజినీర్ విఫలమైతే భవనం కుప్పకూలుతుందని, కానీ రాజకీయనేత ఫెయిలైతే సమాజమే కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. నాడు సమరయోధులు ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన స్వాతంత్య్ర ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామన్నారు. భవిష్యత్తు తరాల కోసం పచ్చని తెలంగాణ అందించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గురుకులల్లో నెలకొన్న సమస్యలపై తర్వలోనే సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా మరో 33 మహాత్మ జ్యోతిబా పూలే పా ఠశాలలకు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేశారని తెలిపారు. అంతకుముందు మంత్రి గంగులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చలికాలంలో విద్యార్థుల స్నానానికి వేడినీటిని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాము ఆడుకునేందుకు స్పోర్ట్స్ గ్రౌండ్ కావాలని విద్యార్థినులు విజ్ఞప్తి చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, తోట రాములు, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్గౌడ్ ఉన్నారు.
రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు
మెట్పల్లి రూరల్, ఆగస్టు 12: ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(ఈసెట్) ఫలితాల్లో మెట్పల్లి మండలం చింతలపేటకు చెందిన ఎలాల హరితారెడ్డి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. సివిల్ ఇంజనీరింగ్ లో 200 మార్కులకు గాను 173 మార్కులు సాధించింది. కాగా మెట్పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదివిన హరితరెడ్డి అనంతరం వరంగల్లో పాలిటెక్నిక్(సివిల్ ఇంజినీరింగ్) పూర్తిచేసింది.