గుడి.. బడి.. బాగుంటే ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పెద్దలు అంటారు. ఎందుకంటే.. విద్యతో విజ్ఞానం, పూజలతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవి రెండూ ఉన్న గ్రామాలు ఎక్కువసంఖ్యలో అభివృద్ధిలో ముందున్నాయి. రాష్ట్ర సర్కారు ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతుండగా, వేంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం కూడా చేయి కలిపింది. తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు రూపాయి ఖర్చు లేకుండా చూడాలన్న ప్రధాన లక్ష్యంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మల్లాపూర్, జూలై 4 : వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు నిశ్చయించుకున్నారు. 1.50 లక్షలతో బ్యాగులు, నోట్స్ బుక్స్, షూలు, టై, బెల్టులు, విద్యాబోధనకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, నోట్స్ బుక్స్, షూలు, టై, బెల్టులు అందజేశారు. ఇటీవల ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. గ్రామంలో విద్యారంగం అభివృద్ధికి గ్రామ పంచాయతీ పాలకవర్గం చేస్తున్న తీసుకుంటున్న చర్యలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
మంచి కార్యక్రమాలు చేస్తున్నం
మా పంచాయతీ పాలకవర్గం, అధికారు లు, గ్రామస్తుల సమష్టి సహకారంతోనే వినూత్న పథకాలను ప్రజలకు అందిస్తున్నం. కొంత కాలంగా మా గ్రామంలో ఎవరైనా చనిపోతే చిన్న, పెద్ద తేడా లేకుండా దహన సంస్కారాల కోసం 10 వేలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తున్నం. ప్రస్తు తం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నోట్బుక్స్, బ్యాగులు, ఇతర సామగ్రి అందజేశాం. బడి బాగుంటేనే అన్నీ బాగుంటాయన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– బిట్ల సరోజన, సర్పంచ్ (వేంపల్లి)
బ్యాగులు, నోట్ బుక్స్ మంచిగున్నయ్
నేను ఐదో తరగతి చదువుతున్న. సర్కారు బడిల పుస్తకాలు మాత్రమే ఇచ్చెటోళ్లు. నేను తరగతి మారినప్పుడల్లా మా అమ్మానాన్నలు నోట్ బుక్లు, బ్యాగులు కొనిచ్చెటోళ్లు. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ వాళ్లు నాతో పాటు అందరికీ బ్యాగులు, నోట్స్, టై, బెల్టులు, షూలు ఇచ్చారు. ఈ బ్యాగులు, నోట్స్, సామగ్రి మంచిగున్నయ్.
– నిత్యవి
సహకారం అభినందనీయం
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా సహకరించడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రిని పంచాయతీ పాలకవర్గం అందించడం అభినందనీయం. మా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. గ్రామానికి పేరు వచ్చేలా మా వంతుగా కృషి చేస్తాం.
– శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు