Chigurumamidi | చిగురుమామిడి, జులై 24 : రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధువులు గ్రామస్తులు శుక్రవారం మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. మృతురాలు మధురవ్వ పూర్తి నిరుపేద కుటుంబం కావడంతో వారు ఇల్లు కోల్పోతే ప్రత్యామ్నాయం ఏమీ లేదని, వారికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంటకు పైగా హుస్నాబాద్, కరీంనగర్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు బొల్లం రమేష్, శ్రీలత, చిగురుమామిడి ఎస్ఐ జగదీశ్వర్ పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.
ప్రభుత్వం హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకో విరమించేది లేదని గ్రామస్తులు పట్టుపట్టడంతో పోలీసులు తహసీల్దార్ కోడం కనకయ్యకు సమాచారమందించారు. మంత్రితో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని, అలాగే కలెక్టర్తో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తానని తహసీల్దార్ కొండం కనకయ్య హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు సర్పంచ్ జంగ శిరీష, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వివిధ పార్టీల నాయకులు రామోజు కృష్ణమాచారి, వంతడుపుల దిలీప్ కుమార్, తాడూరి కిష్టయ్య, అందే స్వామి, నాగేల్లి లక్ష్మారెడ్డి, తాళ్లపల్లి చంద్రయ్య, బాకం సంపత్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.