ముకరంపుర, జూలై 31 : పచ్చదనంతో అలరారే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకువస్తాయి. పట్టణికీకరణ ప్రభావంతో పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పరిమళాలను వెదజల్లే పూలు, ఆరోగ్యాన్నిచ్చే పండ్ల మొక్కలతో పాటు ఆకట్టుకునే ఆకృతుల్లో అల్లుకుపోతూ ఇంటి అందాన్ని మరింత ద్విగునీకృతం చేసే తీగలు, విభిన్న రంగులతో మనసు దోచే క్రోటన్స్, బోన్సాయ్లు, పలు రకాల చిట్టి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వీటి కొనుగోలుకు వేలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఇండ్లలో అపురూపంగా పెంచుకుంటున్న మొక్కలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మొక్కలు వడలిపోవడం.. తెగుళ్లు వ్యాప్తి.. రోగాలు విజృంభిస్తుండడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
మొక్కలు దెబ్బతినేదిలా..
భారీ వర్షాలతో భూమిలో అధికంగా నీళ్లు నిలిచి మొక్కలు సూక్ష్మ, ఇతర పోషకాలు గ్రహించలేవు. దీంతో ఆకులు ఎర్రబారి రాలిపోతాయి. ఎక్కువ రోజులు నీరు నిలిచి ఉండడం వల్ల వేర్లకు ఆక్సిజన్ ప్రసరణ జరగక వడలిపోతాయి. అధిక తేమ కారణంగా తెగుళ్ల వ్యాప్తి తీవ్రమవుతుంది. ఆకుల మీద మచ్చలు ఏర్పడి రాలిపోతాయి
ఎప్పటికప్పుడు నీటిని తొలగించాలి
ఏకధాటిగా వర్షాలు కురిసినా సకాలంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందీ లేకుండా మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. కుండీల్లో నిలిచి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు పారబోయాలి. భూమిలో నాటిన మొక్కల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కాల్వ ద్వారా తొలగించాలి. మొక్కలు త్వరగా కోలుకోవడానికి 10 గ్రాముల 13:0:45, యూరియా 5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. తెగుళ్ల నివారణ, ఆకులపై మచ్చలు ఏర్పడి రాలిపోకుండా నివారించడానికి బావిస్టిన్ 1 గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే త్వరగా కోలుకుని పెరుగుదల వేగంగా ఉంటుంది.
– స్వాతి, ఉద్యానవన శాఖ అధికారి