MLA Gangula Kamalakar | కార్పొరేషన్, జూన్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరీంనగర్లో పేరుకపోయినా సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకొవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు వచ్చిన ఎమ్మెల్యే నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ని సోమవారం కలుసుకున్నారు. నగరంలోని వివిధ సమస్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, వీధిదీపాల నిర్వహణ, మంచినీటి సరఫరా అంశాలపై కమిషనర్తో చర్చించారు.
అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ డిసెంబర్ 2023 వరకు నగరంలో రూ.వేల కోట్ల నిధులతో అద్భుతంగా నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయామని తెలిపారు. నగరాభివృద్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సీఎం ఆక్యూరెన్స్ కింద రూ. 350 కోట్ల నిధులను విడుదల చేశారని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్వీచ్ ఆప్ చేసిన విధంగా నగరంలో సాగుతున్న అన్ని అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. సీఎం ఆక్యూరెన్స్ కింద చేపట్టిన 65 అభివృద్ధి పనులను పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఈ పనులు నిలిచిపోవటం వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఈ అభివృద్ధి పనులకు సంబంధించి కక్ష సాధింపు విధానాన్ని వీడి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. తమ హాయంలో నగరంలో అన్ని ప్రాంతాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేసి నగరాన్ని షైనింగ్ సీటీగా మార్చమన్నారు. కానీ గత ఆరు నెలలు నగరంలోన 40 శాతానికి పైగా వీధిదీపాలు వెలగటం లేదన్నారు. వీటిని మరమ్మతులు చేయించడం, వాటి స్థానాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేసే పని ఎక్కడిక్కడ నిలిచిపోయిందన్నారు. దీని వల్ల నగరం పూర్తిగా చీకటిగా మారుతుందని పేర్కొన్నారు. అలాగే హైలాండ్స్లో అభివృద్ధి చేసిన పౌంటేన్స్, సుందరీకరణ పనులు ఇప్పుడు అధ్వాన్నంగా మారాయన్నారు. వీటి విషయంలోనూ అధికారులు వెంటనే దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు.
నగరంలో తమ హాయంలో ప్రతీ రోజు నీటి సరఫరా చేశామని, కానీ ఇప్పుడు నగరంలో మూడు రోజులకొక్కసారి నీటి సరఫరా జరిగే పరిస్థితి నెలకుందన్నారు. ఎల్ఎండీలోనూ నీరు లేదని, నిర్వహణ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంతో నగరవాసులు నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. నగరం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, తాము స్వీపింగ్ యంత్రాలను తీసుకువచ్చామని, అయితే ఇప్పుడు వాటికి బ్రష్లు కూడా లేవని పక్కన పెట్టారని విమర్శించారు. వర్షా కాలంలో కనీసం ఫాగింగ్ కూడా సరిగా చేయటం లేదన్నారు. నగరపాలక సంస్థలో జవాబుదారీతనంతో పని చేయకుండా ఉన్న అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, అధికారులు వెంటనే చర్యలు తీసుకొవాలన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారన్నారు.
నగరంలో ప్రధాన సమస్య అయినా డంపింగ్ యార్డు బయోమైనింగ్ పనులు వేగంగా చేపట్టాలన్నారు. తమ హాయాంలో బయోమైనింగ్ ప్రారంభించామని, కానీ ఇప్పుడు అది కూడ సరిగా సాగటం లేదన్నారు. డంపింగ్ యార్డు విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కూడా హామీ ఇచ్చారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించేందుకు పని చేయాలన్నారు. తమకు పోరాటాలు కొత్త కాదని, ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం స్పందించకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, నాంపెల్లి శ్రీనివాస్, ఐలేందర్, తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.