కరీంనగర్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి. ఏడాది కాలంలో నాలుగు సార్లు పెరిగిన ధరలు ఈ నెలలో పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి. ఏది కొనాలన్నా అగ్గిలో చెయ్యి పెట్టినట్టే ఉన్నది. నిత్యావసర వస్తువులు లేనిదే పూట గడవని పరిస్థితిలో పేద కుటుంబాలు ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. బియ్యం, నూనెలు, పప్పులు, అల్లం, ఉల్లి, వెల్లుల్లి ధరల్లో భారీ తేడా కనిపిస్తున్నది, ఫలితంగా అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. మొత్తానికి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో బతుకులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని సామాన్యులు బోదిబోమంటున్నారు.
సామాన్యుడికైనా, కోటీశ్వరుడికైనా నిత్యావసర సరుకులు లేనిదే పూట గడవదు. ఇవి అందుబాటులో ఉంటేనే కొనగలిగే శక్తి ఉంటుంది. పూట గడుస్తుంది. కానీ, ఇప్పుడు మార్కెట్లో ధరలు చూస్తే కోటీశ్వరులేమోగానీ సామాన్యులకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ధరలు శరాఘాతంగా మారాయి. ఏడాది ప్రారంభంలో జనవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో పెరిగిన నిత్యావసరాల ధరలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఒక్కో వస్తువుపై రూపాయి నుంచి రెండు రూపాయలు అట్లా పెరుగుతూ వచ్చేవి. గత నెల చివరి వరకు కూడా నియంత్రణలో కనిపించాయి. కానీ, నవంబర్లో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు, పప్పు ఇలా ఏది చూసినా హైక్ అయ్యాయి. గత నెలలో కిలో 130 ఉన్న కందిపప్పు ఇప్పుడు 170కి చేరగా, చింతపండు అయితే 70 నుంచి 120కి చేరింది. అలాగే పసుపు 120 నుంచి 180కి పెరిగింది. ఇక కారం పొడి 200 నుంచి 320కి ఎగబాకింది.
ఎండు మిర్చి 150 నుంచి 280కి చేరగా, ఎల్లిగడ్డ అయితే ఏకంగా 200 నుంచి 340కి పెరిగింది. జీల కర్ర కిలో ధర చూస్తే ఏడాదిలో 200 నుంచి 560కి చేరింది. నువ్వులు, శనగలు, పల్లీలు, బబ్బెర్లు, ఉల్లి, అల్లం, పామాయిల్, తదితర ప్రతి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి. అయితే ఈ యేడాదిలో నాలుగుసార్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ పెరగలేదని ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు వాపోతున్నారు. గత నెలకు, ఇప్పటికి ఇంత తేడా ఏమిటని నోరెళ్లబెడుతున్నారు. ఇంత ధరలు పెట్టి కొనలేమని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గత నెలకు ఈ నెలకు 50శాతం అదనపు ఖర్చులు మీదపడుతున్నాయని వాపోతున్నారు.
దీనికి తోడు కూరగాయలు, చికెన్, మటన్ ధరలు మండి పోతుండడంతో ఏం కొనా లో.. ఏం తినాలో తెలియక అయోమయ స్థితికి గురవుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులకు సరిపడా నిత్యావసరాలు కొని పూట గడుపుతున్నారు. పేద కుటుంబాలకు చెంది న వినియోగదారులైతే ఏ పూటకు ఆపూట అన్నట్లుగా కాలం గడుపుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్పత్తులు పడిపోవడంతోనే ధరలు విపరీతంగా పెరిగాయని తెలుస్తుండగా, దీనిని ఆసరాగా చేసుకుని కొంద రు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారని, ధరలు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. పౌర సరఫరాల అధికారులు ఈ విషయమై దృష్టి సా రించి ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ధరలు బాగా పెరిగినయి
ఇటీవల ధరలు బాగా పెరిగినయి. పంటల ఉత్పత్తి పడిపోవడం, కొన్ని దేశాల నుంచి దిగుమతి కాకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. మన రైతులు కూడా వరికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఇతర పంటలవైపు చూడడం లేదు. నిత్యావసర సరకులు చాలా మట్టుకు స్థానికంగా పండేవే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నయి. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు తక్కువగా కొంటున్నరు. ధరలు తక్కువ ఉంటేనే మాకు ఎక్కువ గిరాకీ అయ్యేది. గత నెలలో పూర్తి దినుసు కొన్న వాళ్లు ఈ నెలల సగం సగమే కొంటున్నరు. గిరాకీ దెబ్బతిన్నట్లే కదా.
– కొసనగొట్టు శ్రీధర్, రిటైల్ వ్యాపారి
సగం సామాను వస్తలేదు
మార్కెట్ వస్తే చుక్కలు కనిపిస్తున్నయి. ఏదీ కొనేటట్టు లేదు. ధరలు బాగా పెరిగినయి. మా అసోంటి సామాన్యులు కొనలేని ధరలు కనిపిస్తున్నయి. పోయిన్నెల ఇంటికి అవసరమైన మొత్తం సామన్ కొనుక్కపోతే ఇప్పుడు సగం సామాను సుతం వస్తలేదు. ఒక్కొక్క వస్తువు మీద ఊహించని తీర్గ ధర పెరిగింది. గతంల 2,500 పెడితే ఇంటికి అవసరమైన వస్తువులు వచ్చేటియి. ఇప్పుడు 5 వేలు పెట్టినా వస్తలేవు. నెలకు పది వేలు మాత్రమే సంపాదించుకునెటోళ్లు ఎట్ల బతుకుతరు? ఏ పూటకు ఆపూట కొనుక్కొని తినుడే. ఉంటే తినుడు, లేకుంటే పస్తులు ఉండుడైతది.
– వీ శ్రీలత, వెలిచాల (రామడుగు)