“కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు.. పేర్లకు, షికార్లకు, పుకార్లకు కారకులు.. హిందువులకు ఏమో అవుతుంది.. దేశాన్ని కాపాడాలె. మోదీ ఏదో చేస్తండు.. అనే పుకార్లను షికారు చేయించి మీ అందరినీ ఇక్కడకు తెచ్చిన్రు.. ఇలాంటి వ్యక్తుల మాటలను యువత మరోసారి నమ్మి మోసపోవద్దు.. ‘కొంత మంది యువకులు.. బానిస పంథాలకు తలవంచి అనుకరించరు.. అన్యాయపు పోకడలను సహించరు..’ అన్న శ్రీశ్రీ మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి. యువత చేతుల్లోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. శ్రీశ్రీ, అల్లూరి వంటి నిజమైన దేశభక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రధాని మోదీదంతా ప్రచార ఆర్భాటమే గానీ, ప్రజలకు చేసిదేమీ లేదు.” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువగర్జన సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించారు.
– శంకరపట్నం, ఆగస్టు 27
శంకరపట్నం, ఆగస్టు 27 : యువత చేతుల్లోనే దేశానికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని, శ్రీశ్రీ, అల్లూరి వంటి నిజమైన దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీని నమ్మి మళ్లీ మోసపోవద్దని, ఆయనదంతా ఆర్భాటమే కానీ, ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఆదివారం శంకరపట్నం మండలంలోని మొలంగూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువగర్జన సభలో ఆయన మాట్లాడారు. చంద్రయాన్-3 సక్సెస్లో కీలకభూమిక పోషించిన ఇస్ర్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఘనతను ప్రధాని మోదీ తనదిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మతవిద్వేషాలు రగిల్చి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని దుయ్యబట్టారు. మతం పేరిట యువతను తప్పుదారి పట్టించడం దుర్మార్గమన్నారు.
ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్సే..
1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీనేనని వినోద్ మండిపడ్డా రు. ఆనాడు 369 మంది ఉద్యమకారులను పిట్ట ల్లా కాల్చి చంపిన చరిత్ర ఆ పార్టీదేనని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఏ రోజు పేపరు చూసినా రక్తపాతం వార్తలే కనిపించేవని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో జయశంకర్ లాంటి మేధావులు మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు దక్కాలంటే తెలంగాణ ఏర్పాటు ఒక్కటే మార్గమని ఆలోచించారని చెప్పారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్.. చంద్రబాబు సర్కారుకు ఎదురు తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని తెలిపారు. 2001లో తనతో పాటు రసమయి కష్టనష్టాలకు ఓర్చి ఉద్యమంలో ముందునడిచామని చెప్పారు.
కేసీఆర్ పాలనలో విప్లవాత్మక పురోగతి
పోరాడి సాధించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ విప్లవాత్మక పురోగతి సాధించారని చెప్పారు. 24 గంటల నిరంతర కరెంట్ సరఫరానే ఇందుకు నిదర్శనమన్నారు. నాడు 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశ నుంచి నేడు 25 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి దశకు చేరుకున్నామన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలతో దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేశామన్నారు. సకల హంగులతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. విదేశాల్లో చదువుకొనే విద్యార్థులకు విద్యానిధి కింద రూ. 20లక్షల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
వైద్య రంగంలో మూడు మెడికల్ కాలేజీల నుంచి జిల్లాకో మెడికల్ కాలేజీని సాధించామన్నారు. 350 మెడికల్ సీట్ల నుంచి 10 వేల మెడికల్ సీట్లకు ఎదిగామన్నారు. 33 జిల్లాలలో 500 పడకల దవఖాలను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషలిస్టులను నియమించే దిశగా సాగుతున్నామని చెప్పారు. ప్రపంచంలో లక్షా 12 వేల చదరపు కి.మీ. పరిధిలో 10 వేల మంది వైద్యులను ఉత్పత్తి చేసే మెడికల్ కళాశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇది సీఎం కేసీఆర్ ఘనతగా అభివర్ణించారు. రేవంత్రెడ్డి అమెరికాలో 3 గంటల కరెంట్ ఇస్తామని మాట్లాడిన మాటలను మరువద్దన్నారు. డీఎస్సీ ద్వారా 6 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని గుర్తుచేశారు. ఈ తొమ్మిదేండ్ల పాలనలో ప్రధానమైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు.
మానకొండూర్ యువత అభివృద్ధి వైపే: ఎమ్మెల్యే డాక్టర్ రసమయి
మానకొండూర్ నియోజకవర్గ యువత అభివృద్ధి వైపే నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్నారు. యువగర్జనను సూపర్ సక్సెస్ చేయడం సంతోషకరమన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తి నేటి యువతలో కనిపిస్తుందన్నారు. నాడు సీఎం కేసీఆర్ కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ జెండా పట్టుకుని నిలబడినప్పుడు గర్జించి వెంట నడిచింది యువతేనని తెలిపారు. యువత భవిత కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగానే నేడు ఆయన వెంట నడుస్తున్నదని చెప్పారు. తాను నాడు ఏ పాట పడినా తెలంగాణ కోసమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం మానకొండూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు.
కాళేశ్వరంతో పల్లెలు సస్యశ్యామలంగా మారాయన్నా రు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఉన్నదనీ, తన వెంట నడిచే వారి కష్ట నష్టాల్లో తాను 1800 రోజులు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన ఎన్నికల ప్రచారాన్ని విజయాల గడ్డ కేశవపట్నం నుంచి మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. తరలివచ్చిన యువతను చూస్తుంటే తన విజయం ఖాయమైపోయినట్లే ఉందని చెప్పా రు. ఎంపీగా బండి సంజయ్కి జిల్లా ప్రజలు అవకాశం కల్పిస్తే నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ఒరిగేందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో మరోసారి గెలిచి గులాబీ జండా ఎగురవేస్తామని కార్యకర్తల కేరింతల నడుమ ప్రకటించారు. అనంతరం మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పూలవర్షంతో అపూర్వ స్వాగతం
యువగర్జనలో పాల్గొనేందుకు వచ్చిన వినో ద్, రసమయి, జీవీఆర్కు నియోజకవర్గం నుంచి తరలివచ్చిన యువత అపూర్వ స్వా గతం పలికింది. తాడికల్ నుంచి డీజే పాటల నడుమ మొలంగూర్ ఫంక్షన్హాల్ వరకు వంద లాది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో నాయకులు ఉత్సాహంగా మ హిళలు దారి పొడవునా పూలవర్షం కురిపించా రు. సమావేశంలో వీరిని యువజన నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. డప్పు, ఒగ్గుడోలు కళాకారులతో పాటు సాంస్కతిక సారథి కళాకారుల ఆట పాటలు, విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీపీ ఉమ్మెంతల స రోజన, జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, వైస్ ఎంపీ పీ రమేశ్, సర్పంచుల ఫోరం చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వీరస్వామి, ప్యాక్స్ చైర్మన్లు సంజీవరెడ్డి, తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు అలీం, పలు గ్రామాల స ర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.