కమాన్ చౌరస్తా, మార్చి 3: యువత సన్మార్గంలో నడవాలని, కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించి కలలను సాకారం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. నేటి యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. నేరాల నియంత్రణకు కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.
కరీంనగర్ 8వ డివిజన్ అల్గ్గునూర్లోని ఓ ఫంక్షన్హాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు, శియాన్ మీడియా సంస్థల సహకారంతో పోలీస్ కమిషనరేట్ శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ప్రేరణ- 2023’కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్, సైబర్ మోసాలు, రుణయాప్లు, కెరీర్ గైడెన్స్పై నిర్వహించిన ఈ అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నేరం జరిగిన తర్వాత శిక్షించడం కంటే నేరం జరుగకూడదనే ముందుచూపుతో పోలీసు శాఖ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక స్థోమతలేక, విద్యాసంస్థల్లో వసతుల్లేక ఎందరో చదువుకు దూరమయ్యారన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
నిరుపేద పిల్లలకు కార్పొరేట్స్థాయి విద్యనందించేందుకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసినప్పుడే మీ జన్మకు సార్థకత అని చెప్పారు. ‘ఒక వైద్యుడు ఫెయిలైతే రోగి మరణిస్తాడు. ఇంజినీర్ ఫెయిలైతే బ్రిడ్జి కూలిపోతుంది. కానీ, ఒక పొలిటీషియన్ ఫెయిలైతే సమాజమే కుప్పకూలుతుంది’ అని అభిప్రాయపడ్డారు. మనం మంచి స్నేహితులను ఎంచుకున్నప్పుడే మంచి దారిలో పయనించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. సెల్ఫోన్లను మంచి కోసం వినియోగించాలని కోరారు. అనంతరం కెరీర్ గైడెన్స్పై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంప నాగేశ్వర్, ఆన్లైన్ మోసాలపై అనీల్ రాచమల్ల, సివిల్ సర్వీసెస్కు ఎంపికపై సివిల్స్ మెంటార్ మల్లవరపు బాలలత, సైబర్ నేరాలపై మిథునకుమార్, సోషల్ మీడియా మేనేజ్ మెంట్పై కే అనిత, ఇన్స్పెక్టర్ మురళి, మాదక పదార్థాలు-దుష్పరిణామాలపై బుర్ర మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంధత్వం అభివృద్ధికి అడ్డుకాదంటూ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న హైదరాబాద్కు చెందిన పల్లవి తన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, ప్రతాప్, ఎస్బీ ఇన్స్పెక్టర్ జీ వెంకటేశ్వర్లు, బీ సంతోష్ కుమార్, సీఐలు నటేశ్, లక్ష్మీబాబు, తిరుమల్, సురేశ్, జానీమియా, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
దుష్టశక్తులకు దూరంగా ఉండాలి
ప్రతి అంశంలో మంచీ చెడు రెండూ ఉంటాయి. ప్రతి దానిని మంచి కోసం వినియోగించాలి. యువత మంచి మార్గంలో పయనించాలి. మత్తు పదార్థాలకు బానిస కావద్దు. జీవితాలను అంధకారం చేసుకోవద్దు. దేశభవిష్యత్తు, అభివృద్ధి నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలి. విద్యార్థులు, యువతశక్తిని నిర్వీర్యం చేసేందుకు దుష్టశక్తులు వేచిచూస్తుంటాయి. అలాంటి శక్తుల బారిన పడుకుండా అప్రమత్తంగా ఉండాలి.
– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
అవగాహన పెంచుకోవాలి
మనిషి ఆహారం లేకుండా నాలుగు రోజులు, నీరు లేకుండా రెండు రోజులు ఉంటడు. కానీ, సెల్ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నడు. ఆ సెల్ఫోన్ను మంచి కోసం వాడుకోవాలి గానీ, చెడు కోసం వాడద్దు. టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందించుకోవాలి. సర్కస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ను సందర్శించి ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోవాలి.
– కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
లక్ష్యంతో ముందుకెళ్లాలి
విద్యార్థులు, యువత ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఆన్లైన్ మోసాలు, నకిలీ బ్యాంక్ లోన్ యాప్స్పై ప్రజల్లో చైతన్యం రావాలంటే యువతతోనే సాధ్యమవుతుంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న మోసాలపై చైతన్యం చేసేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నం. ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తం.
– పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు