Odela | ఓదెల, జులై 9 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ కో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని గమనించి అందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద కొంత మేర ప్రమాదాలు నివారించవచ్చని పేర్కొన్నారు.
కొన్ని సందర్భాలలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేని కారణంగా మేత కోసం వచ్చి పశువుల మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఏఈ మోహన్ నాయక్ తెలిపారు. అలాగే రైతులు కూడా ట్రాన్స్ఫార్మర్ వద్ద జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. రైతులు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరారు. కరంటు మోటార్లు, స్టార్టర్లు, సర్వీస్ వైర్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీనియర్ లైన్ ఇన్స్ పెక్టరు రాజయ్య, లైన్ మెన్ రాజయ్య, అసిస్టెంట్ లైన్ మెన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.