సిరిసిల్ల రూరల్, నవంబర్ 30: కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస్తుందని తెలిపారు. బుధవారం తంగళ్లపల్లిలోని ఠాకూర్ వీఎస్ బీడీ వర్క్స్కు చెందిన ఐదుగురికి విరమణ పొందిన రోజే పెన్షన్ పత్రాలను కంపెనీ జనరల్ మేనేజర్ ముల్క ఆనంద్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 నవంబరు నుంచి విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గతంలో ఈ పథకం కింద పెన్షన్ కోసం అనేక వ్యయప్రాయసాలు పడాల్సివచ్చేదన్నారు. ఇటీవలే సర్కారు ఈ విధానాన్ని సులభతరం చేసిందన్నారు. విమరణ పొందిన రోజే పెన్షన్ మంజూరు పత్రాలను అందజేస్తున్నదని పేర్కొన్నారు. పీఎఫ్కు సంబంధించిన సమస్యలపై కరీంనగర్లోని ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ ఏవో ప్రసాద్, జగిత్యాల, సిరిసిల్ల ఏరియా ఇన్స్పెక్టర్ చారి, అలివేలి, బ్రాంచ్ మేనేజర్ ఇంజమూరి రవి, బీడీ కంపెనీ టేకేదార్లు, కార్మికులు పాల్గొన్నారు.