కలెక్టరేట్, ఏప్రిల్ 13 : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు రానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దళితులను ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దళితబంధు పథకాన్ని హుజురాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, యూనిట్లు ఏర్పాటు చేసుకుని విజయవంతంగా నిర్వహిస్తున్న లబ్ధిదారులతో ఇంట్రాక్ట్ కానున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో గురువారం ఆయన పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు ప్రత్యేక చాపర్ ద్వారా హుజురాబాద్ చేరుకుంటారని, అనంతరం లబ్ధిదారులను కలిసి వారు నిర్వహిస్తున్న యూనిట్లపై అడిగి తెలుసుకుంటారని వెల్లడించారు. ఆయనతో పాటు తాను కూడా హైదరాబాద్ నుంచి రానున్నట్లు పేర్కొన్నారు. తిరిగి హైదరాబాద్ వెళ్లేవరకు అధికారులు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి గంగుల సూచించారు. సమీక్షలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, శిక్షణ కలెక్టర్ వాత్సల్ లెనిన్ టోప్పో, ఇతర అధికారులు పాల్గొన్నారు.