రాజన్న సిరిసిల్ల, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : భూకబ్జాలను ఉపేక్షించేది లేదని, ఉక్కుపాదం మోపాలని అధికారులను బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టర్టేట్లో మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.ప్ర భుత్వ భూములను కబ్జా చేసిన వారినుంచి తిరిగి వెంటనే స్వాధీనం చేసుకోవాలని, వాటిని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలని ఆదేశించారు. తమ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే తగిన ఆధారాలతో కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మహాశివరాత్రి వేములవాడ జాతరకు వచ్చే రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ను ఆదేశించారు. గుడి చెరువులో నీటి నిల్వలు సరిపడా ఉండేలా చూడాలని సూచించారు. అగ్రహారంలో గుట్టల్లో ప్రైవేట్, ప్రభుత్వ భూముల హద్దులకు పెన్సింగ్ చేయాలన్నారు.
ఈ సందర్భంగా హద్దులు లేక గ్రానైట్ తరలి పోతున్నదని, దీంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని విప్ ఆది శ్రీనివాస్ తెలుపగా, గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తే జరిమానాలు వసూలు చేయాలని, భూముల వివరాలు గూగుల్ మ్యాప్లో చేర్చాలని సూచించారు. అలాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటూనే నేతన్నకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందుకు అధికారులు నేతన్నల్లో మనోధైర్యం కల్పించాలని సూచించారు. బతుకమ్మ చీరలు, పాలిస్టర్, కాటన్ వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వస్త్ర ఉత్పత్తులకు అవసరమైన యారన్ ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు. పవర్లూంలు లేని కార్మికులకు యూనిట్లు కేటాయిస్తామన్నారు.
వచ్చే వేసవిలో జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోర్స్, స్టోరేజ్ సిస్టం, డిస్ట్రిబ్యూషన్ సిస్టంను పున సమీక్షించి సోర్స్పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అధికారులు మూడు రోజుల్లో ఎక్స్ర్సైజ్ పూర్తి చేయాలని సూచించారు. చేపపిల్లల విత్తన ఉత్పత్తికి ఎస్సారార్ జలాశయం కేంద్ర బిందువు కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని వెయ్యి మందికి కేజ్ కల్చర్ ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. ముంపు గ్రామాల సమస్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పది ఫలితాల్లో జిల్లాను ముందు వరసలో నిలుపాలని సూచించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.