రాంనగర్(కరీంనగర్)/ ఫర్టిలైజర్సిటీ/జగిత్యాల కలెక్టరేట్/చందుర్తి, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్లు, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట శివారులో, జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరువీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే)ను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్లో సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అసాంఘికశక్తులతో జరిపిన పోరులు అసువులుబాసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
పోలీసు అమరుల స్ఫూర్తితో షీటీంల సహకారంతో విద్యార్థినులు, మహిళలపై అఘాయిత్యాలను అరికడుతున్నామన్నారు. రామగుండం కమిషనరేట్లో సీపీ చంద్రశేఖర్రెడ్డి అమరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీలతో సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు ఒకటి వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన 264 మంది పోలీసుల పేర్లను అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ చంద్రమోహన్ చదివి వినిపించారు. కాగా, సృ్మతి పరేడ్కు ఆర్ఐ కిరణ్ కుమార్ కమాండర్ గా వ్యవహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే పోలీస్ అమరులకు నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జీ. రవి, ఎస్పీ సింధూశర్మ, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతిస్థాపనలో పోలీసుల కృషి ప్రశంసనీయమన్నారు.