POCSO | ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 18 : ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ మైనర్ బాలికను వేదింపులకు గురిచేసిన నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ మహేశ్ బీ గీతే వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికను మధ్యప్రదేశ్ కి చెందిన చతుర్ సింగ్ మున్నా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాలిక తండ్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ బన్సిలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు. అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు తర్వాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్సై శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదించారు. కాగా, శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు అయినట్లు గుర్తించింది. దీంతో సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ నిందితుడైన చతుర్ సింగ్ మున్నాకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేశ్. బీ.గీతే తెలిపారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వేధింపులు లేదా అన్యాయం ఎదురైతే మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తెలిపారు. నేరం చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి, ప్రస్తుత సిరిసిల్ల డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, సీఐలు బన్సిలాల్, వెంకటేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్సై శ్రవణ్ యాదవ్, ఎల్లారెడ్డిపేట్ ఎస్ఐ రమేష్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందిచారు.