నేను నలభై ఏండ్ల సంది డ్యాంల చాపలు పడ్తున్న. ఎన్కట గిట్ల లేకుండె. మమ్ముల ఆదుకునేటోళ్లు లేకుండె. ఎండకాలం డ్యాంల ఎక్కువ నీళ్లుండకపోయేది. కేసీఆర్ సారు అచ్చినంక మాకు మంచి రోజులచ్చినయ్. కాళేశ్వరం ప్రాజెక్టు గట్టి మంచిపనిచేసిండు. చెరువులు, కుంటలు నింపుతున్నడు. డ్యాంలకు నీళ్లిచ్చిండు. నడిఎండల్ల కూడా మస్తు నీళ్లున్నయ్. నీళ్లు ఎక్కువంటే చాపలు మంచిగా పెరుగుతయ్. ఇప్పుడు మస్తు పడుతున్నయ్. సీఎం కేసీఆర్ సారు మా ముదిరాజులను, బెస్తోళ్లను మంచిగ అర్సుకుంటండు. చాపలు పట్టెతానికి వలలు ఇచ్చిండు. తెప్పలు ఇచ్చిండు. బండి సుతం ఇచ్చిండు. బీమా చేసిండు. ఏటా ఉత్తగనే చాప పిల్లలు పోత్తండు. ఇంతకుముందు గిట్ల మంచి పనులు చేసినోళ్లు లేరు. ఇప్పుడు మా కట్టం మాకు దక్కుతంది. కేసీఆర్ సార్తోనే మాకింత మంచి జరుగుతంది. చేతినిండా పనిదొరుకుతంది. మా ముదిరాజులు చానా సంతోషంగ ఉన్నరు.
– తిప్పరవేణి రాజయ్య, మత్స్యకారుడు (కరీంనగర్)
నాడు తెలంగాణ ప్రాంతంలోని చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటల పరిస్థితి దయనీయంగా ఉండేది. పూడిక నిండి, కట్టలు బలంగా లేక వానకాలం కూడా నీటిని నిల్వచేయలేకపోయేది. ఎండకాలం వచ్చే సరికి చుక్కనీరు కనిపించకపోయేది. ఇక వీటిపై ఆధారపడ్డ రైతులు, మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంచిరోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా అనేక చెరువులను పునరుద్ధరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్లు, చెరువుల్లోకి గోదావరి జలాలను మళ్లించారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి తోడ్పాటునందిస్తుండగా, ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకం చేపట్టి మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ) : కులవృత్తులకు చేయూతనిస్తున్న రాష్ట్ర సర్కారు, మత్స్యకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నది. ఏటా కోట్లాది రూపాయలతో చేప విత్తనాలను ఉచితంగా అందిస్తున్నది. 2016-17లో కరీంనగర్ జిల్లాలోని 132 చెరువుల్లో చేపల పెంపకం చేపట్టగా, 2022-23లో 813 చెరువులకు పెంచింది. ఈ యేడాది 1,008 చెరువుల్లో చేపలు పెంచాలని నిర్ణయించింది. అంటే, ఏడేళ్లలో క్రమంగా చెరువుల సంఖ్యను పెంచుతూ ఉచితంగా చేప విత్తనాలను అందిస్తున్నది. ఇటు మానేరు జలాశయంలోనూ పెద్ద ఎత్తున ఉచిత చేప విత్తనాలు విడుదల చేస్తున్నది. ఫలితంగా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. నిజానికి జిల్లాలో చేపల ఉత్పత్తికి చాలా తక్కువ చెరువులు మాత్రమే అనుకూలంగా ఉండేవి. నీటి విస్తీర్ణం చాలా తక్కువగా ఉండేది. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గతేడాది 21,292 హెక్టార్లలో చేపలు ఉత్పత్తి చేశారు. అందులో దిగువ మానేరు జలాశయం కూడా ఉంది. ఏటా ఏ విధంగానైతే చేపల ఉత్పత్తి పెరుగుతున్నదో అలాగే మత్స్యకారులకు ఉపాధి, ఆదాయం కూడా పెరుగుతున్నది.
ఏడేళ్లలో 400 కోట్ల సంపద
రాష్ట్ర ప్రభుత్వం కృషితో మత్స్య సంపద ఏటేటా పెరుగుతున్నది. మొదటి మూడేళ్లలో ఏటా సుమారు 30 కోట్ల నుంచి 35 కోట్లు, ఆ తర్వాత నాలుగేళ్లు 50 కోట్ల నుంచి 55 కోట్ల మత్స్య సంపద ఉత్పత్తి అవుతున్నదని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా మూడేళ్లుగా దిగువ మానేరు జలాశయం, మరో 8 శాశ్వత చెరువుల్లో చేపట్టిన రొయ్యల పెంపకం ద్వారా సుమారు 60 కోట్ల సంపద వచ్చినట్లు చెబుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు, రొయ్యల విత్తనాలు పంపిణీ చేసినప్పటి నుంచి జిల్లాలో సుమారు 400 కోట్ల మత్స్య సంపద చేతికి వచ్చింది. అందులో ఏటా 10 కోట్ల నుంచి 12 కోట్ల విలువైన మత్స్య సంపద కేవలం దిగువ మానేరు జలాశయంలోనే ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా 1,450 మంది దిగువ మానేరు జలాశయంలో లైసెన్స్ ఉన్న మత్స్యకారులు లబ్ధి పొందుతుండగా, జిల్లా వ్యాప్తంగా 186 మత్స్య సహకార సంఘాల్లోని 14,390 మందికి ప్రయోజనం చేకూరుతున్నది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాల ద్వారా మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారు. జిల్లాలో ఉత్పత్తి అయిన మత్స్య సంపద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా పశ్చిమ బంగాలోని అనేక జిల్లాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఉచితంగా చేప పిల్లలు
గతంలో దళారులు, చేపల వ్యాపారులు చెరువుల్లో చేప విత్తనాలు అందించేవారు. దీంతో చెరువుల్లో చేపలు పట్టి మత్స్యకారులు వీరికే విక్రయించాల్సి వచ్చేది. వారు పెట్టిందే ధర, చెల్లించిందే సొమ్ము అన్నట్లుగా మత్స్యకారుల పరిస్థితి ఉండేది. దీంతో చేసిన కష్టమంతా దళారులకే చెందేది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, రిజర్వాయర్లలో కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప విత్తనాలను అందిస్తున్నది. దీంతో దళారుల బెడద తగ్గింది. మత్స్యకారులు తమకు నచ్చిన ధరకు హోల్సేల్గా, రిటైల్గా విక్రయించుకుని ఆదాయం సమకూర్చుకుంటున్నారు. 2016-17లో కేవలం 132 చెరువుల్లో 62.34 లక్షల చేప విత్తనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏటేటా పెరుగుతూనే ఉన్నది. కాళేశ్వరం జలాలు విస్తరిస్తున్న క్రమాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం చేపల చెరువులను పెంచుతూ వస్తున్నది. గతేడాది 813 చెరువుల్లో 2.15 కోట్ల చేప విత్తనాలు విడుదల చేసింది. 2023-24లో 1,008 చెరువుల్లో 2.30 కోట్ల చేప విత్తనాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
కేసీఆర్ సారు అచ్చినంకనే మంచిరోజులు
నాడు ఎండకాలంల ఎల్ఎండీల నీళ్లుండేటియి కాదు. రెండు మూడు టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లుండకపోయేది. సీఎం కేసీఆర్ సార్ చేసిన కృషితోని డ్యాంలకు కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నయ్. ఎప్పుడు ఐదారు టీఎంసీల కంటే ఎక్కువనే ఉంటున్నయ్. నీళ్లు ఎంత ఎక్కువుంటే చాపలు మంచిగ పెరుగుతున్నయ్. ఎండ కాలం సుత మంచిగ పడుతున్నయ్. గతంల గవర్నమెంట్ కంటే ఎక్కువ దళారులే చాప పిల్లలు పోసేది. ఆళ్లు ఏ ధర చెప్పితే గా ధరకే చాపలు ఇస్తుండె. కేసీఆర్ సార్ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన తర్వాత దళారులు కనిపించకుంట పోయిన్రు. గవర్నమెంట్ సహకారంతోని ఇప్పుడు మేమే చాప పిల్లలు పోసుకుంటున్నం. పట్టుకొని అమ్ముకుంటున్నం. తెలంగాణ వచ్చిన తర్వాతనే మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినయ్. కేసీఆర్ సార్ సీఎం అయినంక మోపెడ్ బండ్లు, 20వేల విలువజేసే వలలు, తెప్పలు ఇచ్చిన్రు. లైఫ్ జాకెట్లు ఇచ్చిన్రు. సంఘాలు ఏర్పాటు చేసుకుంటే కేజీ కల్చర్ కింద చాపలు పెంచుకునే అవకాశం కల్పించిన్రు. రూ.ఐదు లక్షల బీమా సదుపాయం చేసిన్రు. మేం ఇపుడు హ్యాపీగా ఉన్నం.
– జంకుటి నరసింహస్వామి, మత్స్యకారుడు
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఏడేళ్లలో చేతికొచ్చిన మత్స్య సంపద
కాళేశ్వరం జలాలతో జీవం పోసుకున్న జలవనరుల్లో చేపల పంట పండుతున్నది. నట్టెండలో ఎండల్లో మత్స్య సంపద పుష్కలంగా చేతికొస్తున్నది. ప్రభుత్వం ఏటా ఉచిత చేప విత్తనాలు సరఫరా చేస్తుండడంతో ఇప్పుడు ఏ చెరువులో చూసినా చేపల వేట పండుగలా సాగుతున్నది. మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుండగా, ఏయేటికాయేడు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. ఏడేళ్లలో 340 కోట్ల విలువైన మత్స్య, మరో 60 కోట్ల విలువైన రొయ్యల సంపద చేతికొచ్చింది.
– కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ)
మంచి లాభమైతంది
మాది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల. పదేండ్ల సంది ఈన్నే చాపలు వడ్తన్న. గతంల మేమే చాప పిల్లలు పోసుకునెటోళ్లం. సేట్లు పోసెటోళ్లు. కేసీఆర్ సార్ వచ్చినంక ఫ్రీగనే చాప పిల్లలు ఇస్తున్నరు. మంచి లాభమైతంది. అంతకు ముందు సేట్లు పిల్లలు పోస్తే ఆళ్లు చెప్పినంత ధరకు చాపలు ఇయ్యాల్సి వచ్చేది. ఇప్పుడు మేము పట్టుకున్న చాపలు మేమే అమ్ముకుంటున్నం.
– బైరి లింగం, మత్స్యకారుడు (కరీంనగర్)
అంతకు ముందు రిక్షా తొక్కెటోన్ని..
మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల. చానా ఏండ్ల సంది కరీంనగర్లనే ఉంటున్నం. ఎనిమిదేండ్ల సంది డ్యాంల చాపలు పడుతున్న. అంతకు ముందు రిక్షా తొక్కెటోన్ని. మావోళ్లంతా చాపలు మంచిగ పడుతున్నయంటే లైసెన్స్ తీసుకున్న. అప్పటి సంది చాపలు పట్టుకుంటున్న. చాపలు మంచిగ వడితే రోజూ వెయ్యి పదిహేను వందలు ఎటువోవు. కేసీఆర్ సారు నాకు వలలు, తెప్పె ఇచ్చిండు. బండి సుతం వచ్చింది. ఇప్పటికైతే మంచిగ బత్కుతున్నం.
– గీకురు రాజేశం, మత్స్యకారుడు (కరీంనగర్)