పల్లె అధ్వానంగా మారింది. పారిశుధ్యం లోపించి కంపుకొడుతున్నది. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పేరుకున్న చెత్త కుప్పలు, అస్తవ్యస్త డ్రైనేజీలతో కళ తప్పింది. మొన్నటిదాకా పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో కళకళలాడిన గ్రామాలు, ప్రత్యేకాధికారుల పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాయి. ఇందుకు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పలు ఊళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ముత్తారం, ఏప్రిల్ 14: ముత్తారం, మచ్చుపేట, లక్కారం, పారుపల్లిలో పరిశుభ్రత లోపించింది. మురుగుకాలువల్లో సిల్ట్ పేరుకున్నది.
ఇన్నాళ్లూ స్వచ్ఛతతో కనిపించిన రోడ్లు చెత్తతో రూపురేఖలు కోల్పోయాయి. ఫలితంగా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఖమ్మంపల్లిలోని పల్లె ప్రకృతి వనంలో నీళ్లు లేక మొక్కలన్నీ ఎండిపోయి పాదులు తేలాయి. ఇంత జరుగుతున్నా పట్టని ప్రత్యేకాధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మొత్తం 14 గ్రామ పంచాయతీలకు తొమ్మిది మంది ప్రత్యేకాధికారులను నియమించారని, వారు ఎప్పుడు వస్తున్నారో.. వెళ్తున్నారో..? తెలియని పరిస్థితి నెలకొన్నదని ప్రజలు వాపోతున్నారు.
కాగా, ఈ విషయమై మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్రెడ్డి వివరణ కోరగా, త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. ఇంకా ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఇంకా గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా కార్యదర్శి లేదంటే, ప్రత్యేకాధికారి గానీ తనను సంప్రదించాలని సూచించారు.