రాంనగర్, పిబ్రవరి 15 : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా అదనపు అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలను సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సీటీసీ)లో బుధవారం పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు శారీరక సామర్థ్య పరీక్షల్లో భాగంగా 1600 మీటర్ల పరుగు ప్రారంభమైంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్, రిస్ట్ బ్యాండ్ ట్యాగింగ్, ఆర్ఎఫ్ఐడీ బిబ్ జాకెట్లను ధరింపజేశారు. పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతో పాటు లాంగ్జంప్, షాట్పుట్ విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసేందుకు హెల్ప్డెస్ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఏవైనా గాయాలుగానీ, ఇతర అనారోగ్య సమస్యలుంటే అత్యవసరంగా చికిత్స అందించేందుకు ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే అభ్యర్థులను దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు. శారీరక సామర్థ్య పరీక్షలకు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 123 మంది గైర్హాజరయ్యారు. హాజరైన 442 మందిలో 129 మంది అర్హత సాధించారు. 313 మంది అర్హత సాధించలేకపోయారు. మరో 35 మంది అనారోగ్యకారణాలు చూపుతూ ధ్రువపత్రాలను సమర్పించగా సీపీ సదరు అభ్యర్థులకు ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతినిచ్చారు. ఇక్కడ అడిషనల్ డీసీపీ జీ చంద్రమోహన్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, సత్యనారాయణ, కాశయ్య, సీహెచ్ మల్లికార్జున్, సీ ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ముని రామయ్య, సూపరింటెండెంట్ ఏవీఎన్ చారి, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు మాధవి, బీ సంతోష్కుమార్, కృష్ణారెడ్డి, రవీందర్, ఆర్ఐలు సురేశ్, జానీమియా, రమేశ్, మురళి, మల్లేశం, మినిస్టీరియల్ విభాగం, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.