కరీంనగర్ కలెక్టరేట్, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే రెండుసార్లు పెంచి వాహనదారుల నడ్డి విరువగా, తాజాగా శనివారం కూడా పెట్రోల్పై 87 డీజిల్పై 91 పైసలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించి, వెంటనే అమలులోకి తీసుకొచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 350 వరకు బంకులుండగా, వీటిలో నిత్యం సగటున 14 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతుంటాయి.
ఈ లెక్కన ఇటీవల పెరిగిన ధరలతో వాహనదారులపై నెలకు రూ.11 కోట్ల దాకా అదనపు భారం పడుతుండగా, తాజాగా పెరిగిన ధరలతో మరో రూ.4.5 కోట్ల భారం పడనుంది. ఇష్టారాజ్యంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం మూలంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇక్కట్లపాలవుతుండగా, తాజాగా పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసరాల ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.