CPS policy | జగిత్యాల, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట సహాద్యక్షుడు అయిల్నేని నరేందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాలలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల తహసీల్దార్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, రామక్రిష్ణ, శ్రీనివాస మూర్తి, సాయిని శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాస్, జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.