MLA Padi Kaushik Reedy | హుజురాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసన దీక్షపై పోలీసుల అణచివేత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్రాంగం, ప్రజా ఉద్యమాన్ని అడ్డుకునే దిశగా వ్యవహరిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి పిలుపుమేరకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున మంగళవారం ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొన్నారు.
మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీక్షలో పాల్గొనే ప్రజల కోసం జేఏసీ నాయకులు టెంట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు రోడ్లపై టెంట్లు వేయరాదంటూ అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రజలు మండుతున్న ఎండలోనే నిరసన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది చెట్ల నీడలో నిలబడి తమ నిరసనను కొనసాగించగా, మరికొందరు నేరుగా ఎండలోనే కూర్చొని దీక్ష చేశారు.
ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలను పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరించడంపై నిరసనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యపై శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల ఈ అత్యుత్సాహ ధోరణిపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఉద్యమాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.