చొప్పదండి, జూలై 27: వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళపల్లిలోని మల్లికార్జున కుంటపై ఉన్న మహావృక్షం నేలకూలింది. రాగంపేటలోని పందివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాగంపేట, రేవెల్లి, పెద్దకుర్మపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుండడంతో ప్రజలు అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు.
చొప్పదండి పట్టణంలోని కుడి చెరువు మత్తడి దుంకుతుండడంతో రెడ్డి, కుమ్మరి వాడల్లోని ఇండ్లల్లోకి నీళ్లు రావడంతో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఎక్స్కవేటర్ను తెప్పించి నీటిని తొలగించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రామడుగు, జూలై 27: రామడుగు శివారులోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పాత వంతెన మునిగిపోగా, ఎస్ఐ తోట తిరుపతి రాకపోకలు నిలిపివేశారు. గుండి పెద్ద చెరువు మత్తడి వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వెలిచాల-కొత్తపల్లి మధ్య రోడ్ డ్యాం ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేశరాజ్పల్లి ఊర చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఎస్ఐ తోట తిరుపతి మొరం తెప్పించి మరమ్మతులు చేయించారు. మోతె వాగు ఉధృతి పెరుగడంతో రుద్రారం వైపు వెళ్లే వంతెనను ఆనుకొని వరదనీరు ప్రవహించింది. వంతెన వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వెలిచాలలో పెద్ద చెరువు, చిన్న చెరువుతో పాటు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. రామడుగు, మోతె వంతెనలు మునిగిపోవడంతో ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ఎస్ఐ తిరుపతి మండల ప్రజలకు సూచించారు. పాడి రైతులు, గొర్రెల పెంపకందారులు లోతట్టు ప్రాంతాలకు పశువులను మేతకు తీసుకెళ్లవద్దని మండల పశువైద్యాధికారి అనిల్కుమార్రెడ్డి సూచించారు. వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రామడుగు వాగుపై నిర్మిస్తున్న వంతెనను ఆర్అండ్బీ అధికారి రవీందర్, ఏఈ లక్ష్మణ్, గుత్తేదారు నారాయణరెడ్డి, ఆర్ఐ బాలకిషన్, వీడీసీ చైర్మన్ పంజాల జగన్మోహన్గౌడ్ పరిశీలించారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో వన్నారం పరిధిలోని నేతకానిపల్లికి వెళ్లే దారి తెగిపోయే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రవాహానికి రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో నేతకానిపల్లికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గంగాధర, జూలై 27: మండలంలో గురువారం 140.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపూర్ రిజర్వాయర్ మత్తడి దుంకుతోంది. వెంకటాయపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట వద్ద పరిస్థితిని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎస్ఐ అభిలాష్ పరిశీలిస్తున్నారు. అవసరమైతే కట్టకు గండి పెట్టడానికి అనవుగా ఎక్స్కవేటర్ను అందుబాటులో ఉంచారు. సర్వారెడ్డిపల్లి, బూరుగుపల్లి, ర్యాలపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొండాయపల్లి, గంగాధర, మల్లాపూర్, కురిక్యాల, ఉప్పరమల్యాల, వెంకంపల్లి, గర్శకుర్తి, గట్టుభూతూర్ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. గంగాధర-పెగడపల్లి మార్గంలో లక్ష్మీదేవిపల్లి వద్ద రోడ్డుపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పరమల్యాల-కురిక్యాల, గర్షకుర్తి-కాసారం, గట్టుభూతూర్-హిమ్మత్ నగర్, గోపాలరావుపల్లి-మల్లాపూర్, ర్యాలపల్లి-కొండాయపల్లి, ర్యాలపల్లి-చర్లపల్లి (ఆర్), గంగాధర-నాగిరెడ్డిపూర్, గంగాధర-ఇస్తార్పల్లి గ్రామాల మధ్య రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వెంకటయ్యపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నారాయణపూర్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతున్నది. ఉప్పరమల్యాల ఎర్రకుంట నిండడంతో ఇండ్లల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. సర్పంచ్ బొల్లాడి మంజుల-శ్రీనివాస్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. గర్షకుర్తి ఊర చెరువు నిండి గ్రామంలోకి నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా సర్పంచ్ అలవాల నాగలక్ష్మి-తిరుపతి ఇసుక బస్తాలు వేయించారు. హిమ్మత్నగర్లో ఇండ్లల్లోకి నీళ్లు రావడంతో సర్పంచ్ మాల చంద్రయ్య పరిశీలించారు. గట్టుభూతూర్ చెరువు మత్తడి దుంకుతుండడంతో కట్ట వద్ద పరిస్థితిని సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి పరిశీలించారు. బూరుగుపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతుండడంతో పరిస్థితిని మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు పరిశీలించారు. వెంకటాయపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిస్థితిని సర్పంచ్ మేఘరాజు పరిశీలించారు.
కరీంనగర్రూరల్, జూలై 27: మండలంలోని బొమ్మకల్, ఆరెపల్లి, వల్లంపహాడ్, నగునూర్, ఎలబోతారం, ఇరుకుల్ల, చేగుర్తి, గోపాల్పూర్, తదితర గ్రామాల్లోని చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇరుకుల్ల, గోపాల్పూర్, నగునూర్, మొగ్దుంపూర్ చెక్ డ్యాంలపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతున్నది. చెర్లభూత్కూర్, దుర్శేడ్, బొమ్మకల్లో పలు ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరింది. ఇరుకుల్ల, దుర్శేడ్లో రాజీవ్ రహదారిపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తీగలగుట్టపల్లి వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. చెర్లభూత్కూర్లోని పోచమ్మ వాగు ప్రవహించడంతో గుజ్జులపల్లి-చెర్లభూత్కూర్ మధ్య రహదారిపై గుజ్జులపల్లి, ప్రశాంత్నగర్, ఐతరాజ్పల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. చెర్లభూత్కూర్-మొగ్దుంపూర్ గ్రామాల మధ్య రోడ్ డ్యాంపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెర్లభూత్కూర్ పెద్ద చెరువు మత్తడి దుంకుతుండడంతో చెర్లభూత్కూర్-తాహెర్కొండాపూర్, చెర్లభూత్కూర్-ఐతరాజ్పల్లి, చెర్లభూత్కూర్-గుజ్జులపల్లి, చెర్లభూత్కూర్-ప్రశాంత్నగర్ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెర్లభూత్కూర్లోని ముదిరాజ్ కాలనీతో పాటు పలు కాలనీల్లో ఇండ్లల్లోకి నీళ్లు రావడంతో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి గౌడ్ సహాయక చర్యలు చేపట్టారు.
ముకరంపుర, జూలై: భారీ వర్షం, ఎగువ నుంచి వస్తున్న వరదతో నగర శివారులోని రేకుర్తి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. నూతనంగా నిర్మించిన మురుగు కాలువతో కాలనీ వాసులకు వరద ముప్పు తప్పింది.
కొత్తపల్లి, జూలై 27: కొత్తపల్లి పెద్ద చెరువు నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. సుమారు 20 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పెద్ద చెరువుకు వరద ఉధృతి పెరగడంతో అక్కడే ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. అలాగే, కొత్తపల్లి-వెలిచాల బైపాస్ రోడ్డుపై వరద ఉధృతి పెరుగడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ సహాయక చర్యలు చేపట్టారు. నాగులమల్యాల, బావుపేట చెరువులు పూర్తిగా నిండి ఎలగందుల, కమాన్పూర్ చెరువుల్లోకి వచ్చి చేరుతుండడంతో మత్తడి దుంకి రాకపోకలు నిలిచిపోయాయి. బద్దిపల్లి, నాగులమల్యాల, రేకుర్తిలో స్వల్పంగా ఇండ్లకు నష్టం వాటిల్లినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.