పుట్టుకొస్తున్న దళారులు
పోలీసు, రవాణాశాఖ, విజిలెన్స్, మున్సిపల్, రెవెన్యూ విభాగాల్లో నయాదందా
మాయమాటలు నమ్మి నష్టపోతున్న బాధితులు
అసలు విషయం తెలిసే సరికే వేలకు వేలు సమర్పణ
ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఘటనలు
“క్వారీలో ఇల్లీగల్గా ఇసుక తీస్తారా..? ఎంతైనా తీసుకోండి.. ఏం పర్వాలేదు. లోకల్ పోలీసులు, నాయకులు, రెవెన్యూ, పంచాయతీ, ఇతర అన్ని విభాగాల అధికారులను నేను చూసుకుంటా.. కాక పోతే మీరు ఎంతిస్తారో చెప్పండి. ఏ ఇబ్బంది లేకుండా చూస్తా..” పోలీసు, రెవెన్యూ అధికారుల పేరు చెప్పి వసూలు చేస్తున్న ఓ దళారి..
“మీ మధ్య ఉన్న భూ తగాదాను నేను సెటిల్ చేస్తా. ఇక్కడి పోలీసు అధికారులు నాకు తెలుసు.. రెవెన్యూ అంతా నేనే చూసుకుంటా.. ఖర్చులు అయితయి. పనిచేయించే జిమ్మేదారి నాది.. నేను చూసుకుంటా..” భూవివాదాల సాకుతో టోకరా వేస్తున్న ఓ దళారి..
.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దళారుల నయా దందాలు వెలుగు చూస్తున్నాయి. అడ్డదారుల్లో సంపాదించుకోవాలనుకునే వారి ఆశలను సొమ్ము చేసుకుంటున్న వారు కొందరైతే.. పేద, మధ్య తరగతి వ్యక్తుల మధ్య తలెత్తే భూ తగాదాలు, ఇండ్ల నిర్మాణాల వంటివి ఆసరాగా చేసుకొని దోచుకోవాలనుకుంటున్న వారు మరికొందరు. నిజానికి ఈ దళారులు ఏమైనా పనులు చేస్తున్నారా? అంటే అదీ లేదు. పనైతే వారే చేయించినట్లుగా నమ్మబలికి మరిన్ని డబ్బులు వసూలు చేయడం. పనికాక పోతే కుంటి సాకులు చెప్పి.. అప్పటికే వసూలు చేసిన సొమ్మును మింగేయడం.. వీరికి పరిపాటిగా మారింది. సామాన్యులు తాము మోసపోయామని తెలుసుకునే లోపే.. వారి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్న దందాల వ్యవహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. దళారుల మాయ మాటలు నమ్మవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది.
కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈజీగా మనీ సంపాదించాలనుకునే కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. కొందరు పోలీసులు, మరికొందరు రవాణా శాఖాధికారులు, ఇంకొందరు విజిలెన్స్, ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం వెలుగుచూశాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలైన విషయం తెలిసిందే. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా.. దళారుల అవతారమెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇసుక క్వారీలు పలుచోట్ల అధికారికంగా కొనసాగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొంతమంది ఇంకా అక్రమాలకు పాల్పడుతూ అనధికారికంగా ఇసుక దందాను నడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దాడిచేస్తూ సంబంధిత వాహనాలను పట్టుకొని జరిమానా విధిస్తున్నారు. వీటన్నింటినీ గమనించిన దళారులు.. ముందుగా ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు, సంబంధిత యజమానులతో ముందుగానే మాట్లాడుతున్నారు.
“మీరు ఓవర్లోడుతోపాటు ఎక్కడికైనా ఇసుక తీసుకెళ్లండి. మీకు ఏం కావద్దంటే… మాకు ఎంతిస్తారో చెప్పండి” అంటూ వారిని మాటల్లోకి దింపుతున్నారు. అంతేకాదు.. అక్కడి నుంచే ఒక నంబర్కు ఫోన్ చేసి.. “సర్.. ఫలానా బండి ఈరోజు నుంచి ఇసుక తీసుకెళ్తుంది. మీరెవ్వరూ ఏమీ అనొద్దు..” అంటూ లౌడ్ స్పీకర్ ఆన్చేసి మరీ మాట్లాడుతున్నారు. ఫోన్లో పేరు చూస్తే అది రవాణా అధికారి పేరుతో లేదా పోలీసు, రెవెన్యూ అధికారుల పేరు తో ఫీడ్ చేసుకొని ఉంచుతున్నారు. తమ ముందే అంత ఓపెన్గా మాట్లాడడంతో.. దళారి మాట నిజమని నమ్ముతున్న కొందరు సంబంధిత దళారికి అడ్వాన్స్ రూపేనా కొంత అమౌంట్ ముట్టజెప్పుతున్నారు. సంబంధిత వాహనదారుడికి మంచి జరిగితే.. అదంతా తాను చేయడం వల్లేన ని సంబంధిత దళారి సదరు వ్యక్తుల నుంచి మ రింత లాగుతున్నాడు. అనుకోకుండా అధికారుల తనిఖీల్లో పట్టుబడి బండి సీజ్ అయితే.. సంబంధిత దళారి ఏదో ఒక కథ చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇది ఒక్క ఇసుక వాహనాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. చాలా విభాగాల్లో దళారులు పుట్టుకొచ్చి నమ్మించి దోచుకుంటున్నారు.
బెదిరింపులు.. ఆపై వసూళ్లు
పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా ఇతర నిర్మాణాలు చేసిన సమయంలో.. ముందుగా వారి వద్దకు వెళ్లి.. ‘నీవు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నావు.. నాకు ఏం ఇస్తావో చెప్పు.. లేకుంటే అన్ని విభాగాల అధికారులకు ఫిర్యాదు చేస్తా” అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొంత మంది గొడవెందుకులే.. అనుకొని ఎంతో కొంత సర్దుబాటు చేసి పంపిస్తుండగా, ఇంకొందరు వారి మాటలను తిప్పికొడుతున్నారు. దీంతో.. సదరు వ్యక్తులు ఆకాశరామన్న పేరుతో అధికారులకు లేఖలు రాస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరైనా ఒక్క అధికారి వెళ్లినా.. సరే దానిని ఆధారంగా చేసుకొని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిర్మాణాల విషయంలోనూ అనుమతులు తెస్తామంటూ కొందరు దళారులు మాయమాటలు చెప్పి దోచుకుంటున్నారు. అలాగే, పట్టాభూముల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలు యజమానిని బెదిరించి డబ్బుల వసూళ్లకు దిగుతున్నారు. లేదా ఆక్రమించడం.. క్షేత్రస్థాయిలో గొడవలు చేయడం తద్వారా ఏదో విధంగా కొన్ని డబ్బులు పట్టిస్తున్నారు. నిజానికి సంబంధిత దళారుల్లో నూటికి 95 శాతం మందికి అధికారులెవరూ తెలియదు. కేవలం ఎదుటి వ్యక్తి బలహీనత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆడుతున్న డ్రామాలు. వీటి వల్ల అధికారులు బదనాం అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
పకడ్బందీ చర్యలు
నిజానికి దళారులు, మోసకారుల పని పట్టేందుకు ఒకవైపు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ అనేక చర్యలు చేపడుతున్నారు. ఏ విషయంలోనూ దళారుల మాటలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అధికారులను కలిసి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి తప్ప.. మధ్యవర్తులను ఆశ్రయించ వద్దని పదేపదే ప్రకటనలు జారీ చేస్తున్నారు. దౌర్జన్యంగా భూముల ఆక్రమణలకు పాల్పడినా, లేదా డబ్బుల వసూళ్లకు పాల్పడినా వారిపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుడి కోరిక మేరకు.. అవసరమైతే పేర్లు బయట పెడుతామని, లేదంటే విచారణ చేసి.. సంబంధిత దళారులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీపీ వీ సత్యనారాయణ ప్రకటించారు. అలాగే, ప్రభుత్వ పథకాల నుంచి మొదలు ఇతర ఏ అంశాల్లోనూ దళారుల మాటలు నమ్మవద్దని, దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, నిర్మాణాల అనుమతులన్నీ నిబంధనల ప్రకారమే ఉంటాయ ని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి వాటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.
అప్రమత్తతే అసలు మందు
మాయమాటలు చెప్పి.. అందినకాడికి దండుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి ఆశలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని.. సొమ్ముచేసుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే. నిజా నిజాలు తెలుసుకోకుండా.. పని చేయిస్తామని చెప్పగానే డబ్బులు ఇవ్వడం ఆపై ఇబ్బందులకు గురికావడం మంచిది కాదంటున్నారు అధికారులు. ఎవరు మంచి.. ఎవరు చెడు.. ఎవరిని నమ్మాలి.. ఎవరిని నమ్మవద్దో.. ఒక్క క్షణం ఆలోచించాలని, అప్పుడే దళారుల దగా నుంచి బయటపడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. నిజానికి అలా దగా చేసిన వారి పని పట్టేందుకు ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించింది. ఒక్క ఫోన్ చేస్తే.. పోలీసులు వచ్చి వాలుతారు. అలాగే, కలెక్టర్ నుంచి మొదలు ఇతర ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. మోసపోకుండా ఉండాలంటున్నారు నిపుణులు. మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది.
ఫిర్యాదు చేయండి
రవాణా శాఖాధికారుల పేరు చెప్తూ కొంత మంది లారీ యజమానులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ విషయాన్ని సీరియస్గా పరిగణిస్తున్నాం. మా పరిధిలో సమగ్ర విచారణ చేస్తున్నాం. విచారణలో తెలిసిన వివరాలను బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మధ్య దళారుల మాటలను నమ్మవద్దు. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఎదురైతే.. dtokarimnagar@tstransport.in మెయిల్కు ఫిర్యాదు చేయాలి. తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాం.
–డీటీసీ చంద్రశేఖర్గౌడ్
చట్ట వ్యతిరేక పనులను సహించం
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రశ్నే లేదు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అలాగే, ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు భూములను దౌర్జన్యంగా లేదా అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లాం.
-కరీంనగర్ మేయర్ వై సునీల్రావు